తల్లీ, తండ్రి, గురువూ దైవం.. ఇదీ పెద్దలు చెప్పేమాట. తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానమని వారి ఉద్దేశం. తరగతి గది వేదికగా పిల్లల బంగారు భవితను తీర్చిదిద్దాల్సింది ఉపాధ్యాయులే. అందుకే తల్లిదండ్రుల తర్వాతి స్థానం వారిదే. అయితే రోజులు మారుతున్నాయి. ఉపాధ్యాయుల వైఖరి మారుతోంది. అందుకు తగ్గట్లుగానే విద్యార్థుల తీరు కూడా మారిపోతోంది. కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సర్కారీ బడిలో పనిచేస్తూ ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న ఘటనలు కూడా అక్కడక్కడా జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల బదిలీ అయిన ఉపాధ్యాయులకి విద్యార్థులు బాధతో ఆత్మియ వీడ్కోలు పలుకుతున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నడుమ ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల కోసం గొప్పగా ఆలోచన చేశాడు. విద్యార్థులు ఎందుకు పాఠశాలకు రావటం లేదో తెలుసుకుని.. తన సొంత డబ్బుతో వారి ఇబ్బందులు తీర్చి శెభాష్ అనిపించుకున్నారు.* జిల్లా శివారు ప్రాంతమైన సూరంపేట.. ఈ ఊరిలో ఓ స్కూలు ఉంది. .. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఐదుమంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ప్రభుత్వాలు స్కూలుకు పంపితే తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తున్నా కూడా.. ఈ స్కూలు వైపు చిన్నారులు కన్నెత్తి చూడటం లేదు. పైపెచ్చు ఏటికేడూ స్కూలుకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గిపోతూ చివరకు ఐదుకు చేరింది. వారిలోనూ స్కూలుకు నిత్యం వచ్చేది.. ఏ ఇద్దరో ముగ్గురో.. అయితే సూరంపేట ప్రాథమిక పాఠశాలలో అనిశెట్టి సీతారామరాజు అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. స్కూలుకు వచ్చే ఇద్దరు, ముగ్గురు చిన్నారులకు పాఠాలు చెప్తున్న ఆయనకు.. అసలు పిల్లలు స్కూలుకు ఎందుకురావటం లేదనే అనుమానం కలిగింది. *దీంతో గ్రామస్థులను ఈ విషయంపై అడిగారు. ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉన్నా చిన్నారులు స్కూలుకు ఎందుకు రావటం లేదంటూ ఊరిలో వాకబు చేశారు. చివరకు పిల్లలు పాఠశాలకు ఎందుకు రావటం లేదో సీతారామరాజు కారణం తెలుసుకున్నారు. విద్యార్థులు స్కూలుకు రాలేకపోవటానికి సరైన మార్గం లేకపోవటమే కారణమని గ్రామస్థుల ద్వారా సీతారామరాజు తెలుసుకున్నారు.* స్కూలుకు వెళ్లాలంటే రైల్వే అండర్‌పాస్‌ వద్ద ఉన్న మురుగు కాలువ పక్కగా వెళ్లాల్సి వస్తోందని.. ఈ మార్గం చాలా ప్రమాదకరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సమస్యకు ప్రత్యామ్నాయం ఆలోచించిన సీతారామరాజు.. తన సొంత నిధులు లక్ష రూపాయలు ఖర్చు చేసి.. సమీపంలోని పంట కాలువ మీదుగా కాలిబాట వంతెన నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తి అయితే విద్యార్థులు సురక్షితంగా స్కూలుకు వెళ్లి వచ్చేందుకు వీలు కలుగుతుంది. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనిని స్థానికులు అభినందిస్తున్నారు.