మహారాష్ట్ర బుల్ధానా నియోజకవర్గ ముంబయిలోని చర్చ్‌గేట్ వద్ద ఎమ్మెల్యే క్యాంటీన్‌లో పనిచేసే ఉద్యోగిపై ఆయన దాడిచేసిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. పాచిపోయిన పప్పు వడ్డించారని ఆరోపిస్తూ.. క్యాంటీన్ ఉద్యోగిని కాలితో తన్ని, చంెపలు వాయించడం ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఎమ్మెల్యే మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తాను చేసిన చర్యను సమర్థించుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే ఈ ఘటనను తీవ్రంగా తప్పుబట్టారు.అయితే, సంజయ్ గైక్వాడ్‌కు వివాదస్పద వ్యాఖ్యలు, దురుసు ప్రవర్తనలు కొత్తేం కాదు. 2023 సెప్టెంబరులో కాంగ్రెస్ నేత రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నోరుజారారు. అలాగే, 2024 జనవరిలో ఓ ప్రసంగంలో ‘తమ ఓట్లను మందు, మటన్, డబ్బులకు అమ్ముకునే ఓటర్లు వేశ్యలకన్నా హీనమైన వారు’ అంటూ ఓటర్లను అవమానించారు.ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో తన కారును శుభ్రం చేయించిన వీడియో కూడా గతంలో వైరల్ అయింది. ఆయన మాత్రం ‘కారులోనే వాంతులు చేసిన కానిస్టేబుల్.. స్వచ్ఛందంగా శుభ్రం చేశాడు’ అన్నారు. 2017లో పులిని వేటాడినట్లు చెప్పి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు ఎదుర్కొన్నారు. అప్పట్లో‘ఆ పులి గోళ్లను నేను మెడలో వేసుకున్నాను’ అంటూ చెప్పారు. మరాఠీయేతరులపై ముంబయిలో దాడులు వేళ.. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతవారం ఓ ఫుడ్ స్టాల్ యజమానిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన తాజాగా, పప్పు బాగాలేదని ఆరోపిస్తూ ఓ సాధారణ ఉద్యోగిపై దాడి చేసిన గైక్వాడ్, జాతి, ప్రాంతీయ అంశాన్ని కూడా వివాదంలోకి లాగారు. ‘ఇక్కడి షెట్టీలు (దక్షిణ భారతీయులు) పదుల సంవత్సరాలుగా మా ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మరాఠీలు ఇక్కడ క్యాంటీన్ నడిపితే ఈ పరిస్థితి ఉండేది కాదు’ అని మరాఠీ-దక్షిణాదిల మధ్య విభజన చిచ్చు పెట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాత్రం ‘‘నాకు మలబద్ధకం సమస్య ఉంది. అలాంటి తినుబండారాల వల్ల నా ఆరోగ్యం పాడవుతుంది. నా ప్రాణాలతో ఆడుకున్నారు’’ అని ఆరోపించడం గమనార్హం.