ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ పనులు వేగవంతం అయ్యాయి. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో స్పీడ్ పెంచారు.. కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఏడాదిలోనే పరిష్కరించింది. పశ్చిమ ప్రాంత ప్రజల కలను త్వరలోనే నెరవేర్చేలా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ, పరిహారం సమస్యలను పరిష్కరించడంతో రైల్వేస్టేషన్ల నిర్మాణం, ట్రాక్ పనులు ఊపందుకున్నాయి. నడికుడి - శ్రీకాళహస్తి మొత్తం పొడవు 308.76 కిలోమీటర్లు ఉంది.. ప్రకాశం జిల్లాలో 107 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మేరకు ఆ పనులు చేపట్టారు.. ఈ ప్రకాశం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 32 గ్రామాల నుంచి 897.21 ఎకరాల భూమిని సేకరించారు అధికారులు. నడికుడి-శ్రీకాళహస్తి సంబంధించి గతేడాది మార్చి 24న గుండ్లకమ్మ-దర్శి వరకు ట్రాక్ పూర్తయింది. అంతేకాదు పొదిలి వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం దర్శి-కనిగిరి మధ్య రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 52 కిలోమీటర్ల మేర మూడో దశ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో వంతెనల నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది చివరి నాటికి కనిగిరి వరకు రైలు నడిచే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ నుండి పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి వరకు పనులు జరుగుతున్నాయి. పొదిలిలోని రాజుపాలెం వరకు రైల్వేకట్ట పనులు పూర్తయ్యాయి. ఈ పనుల్ని వేగవంతం చేసి పొదిలి, కనిగిరి, రాజుపాలెం కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. గతంలో భూముల పరిహారం సమస్య పరిష్కరించడంతో పనులు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పుడు ఎర్త్‌వర్క్‌ పూర్తయి, కంకర వేస్తున్నారు. రాజుపాలెం దగ్గర రైల్వేస్టేషన్‌ నిర్మాణం వేగంగా సాగుతోంది. రెండు ప్లాట్‌ఫారాల్లో ట్రాక్‌ వర్క్‌ అయిపోయింది. గదుల నిర్మాణం కూడా పూర్తయింది. విద్యుత్తు, సిగ్నల్ పనులను చేస్తున్నారు. ఈ ఏడాది చివరి (డిసెంబర్) నాటికి కనిగిరి వరకు రైలు నడిచే అవకాశం ఉంది అంటున్నారు. అటు నెల్లూరులో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే దర్శి వరకు ప్యాసింజర్ రైళ్లతో ట్రయల్ రన్ పూర్తి చేశారు.. పొదిలి వరకు రైలును నడిపి చూశారు. ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు. అంటు చెన్నై వైపు వెళ్లేవారికి కూడా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల రైల్వే లైన్ కోరిక కూడా నెరవేరుతుంది అంటున్నారు. ఈ పనుల్ని వేగవంతం చేసి త్వరగా రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని స్థానికుల కూడా కోరుతున్నారు.