రియల్ విక్రమార్కుడు.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన పోలీస్ ఆఫీసర్ కథ

Wait 5 sec.

పిల్లలను పెంచి.. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంతో తల్లిదండ్రుల ఇద్దరిదీ సమాన బాధ్యతే. అయితే, ఈ విషయంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. ఎవరూ భర్తీ చేయలేనిది. జన్మనివ్వడంతో మొదలయ్యే ఈ ప్రయాణంలో, బిడ్డల శారీరక, మానసిక, భావోద్వేగ ఎదుగుదలకు ఆమే పునాది వేస్తుంది. పిల్లల భవిష్యత్తుకు ఆమె మొదటి మార్గదర్శిగా నిలుస్తుంది. అయితే, అలాగని తండ్రి పాత్ర తక్కువే కాదు. కేవలం ఆర్థిక అవసరాలు తీర్చడమే కాకుండా.. పిల్లల భావోద్వేగ ఎదుగుదల, క్రమశిక్షణ, సామాజిక నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో తండ్రిది క్రియాశీలక పాత్ర.అయితే, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోవడం, విబేధాల వల్ల విడిపోవడం వంటి కారణాలతో సింగిల్ పేరెంట్‌గా పిల్లలను పెంచడం సవాల్. ఇక, పిల్లలు నెలలు వయసులో ఉన్నప్పుడు తల్లి చనిపోతే.. ఆ బిడ్డను సాకడం ఆషామాషీ విషయం కాదు. విక్రమార్కుడు సినిమాలో భార్య చనిపోతే తన కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. తుదిశ్వాస వరకూ చిన్నారి కోసం తండ్రి పడే ఆరాటం మనసుల్ని హత్తకుంటుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కూడా అలాంటిందే. కోవిడ్ మహమ్మారి సమయంలో భార్యను పోగొట్టుకున్న సువేందు సర్కార్ పోలీస్ ఆఫీసర్.. తన ఇద్దరు పిల్లలకు అమ్మయ్యారు. పాపకు ఆరు నెలలు, బాబుకు ఏడాదిన్నర వయసులో ఆయన భార్య కరోనాతో కన్నుమూశారు. దీంతో ఇద్దరు పిల్లలను చూసుకోవడం కష్టమని, మరో పెళ్లి చేసుకోమని ఆయనకు కుటుంబంతో పాటు అందరూ సలహా ఇచ్చారు. ఒంటరి తండ్రివి, పిల్లల ఆలనాపాలనా చూసుకోలేవనే వారి వాదన తప్పని ఆ పోలీస్ అధికారి నిరూపించారు. దాదాపు ఆరేళ్లుగా అన్నీతానై తన పిల్లల కంటికి రెప్పలా చూసుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచి, శెభాష్ అనిపించుకుంటున్నారు. భార్య చనిపోయి ఆమె చితి చల్లారక ముందే మరో వివాహం చేసుకునేవాళ్లు ఎందరో. ఈయన మాత్రం పిల్లలే తన సర్వస్వమని సువేందు భావించారు. ‘‘నాకు కోల్పోవడం కొత్త కాదు.. రెండేళ్లు వయసులో ఉన్నప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లిని పోగొట్టుకుంటే.. బాధ్యతలు తీసుకోడానికి తండ్రి నిరాకరించాడు.. అనాథను అయిన నేను బంధువుల ఇళ్లలో ఉంటూ వాళ్లు పెట్టింది తిని పెరిగాను.. కొన్ని రోజులు రూ.20 కోసం హోటల్‌లో సర్వర్‌గా పనిచేశాను.. నా పిల్లలు ఎప్పటికీ అనాథలుగా ఉండకూడదు అని అప్పుడే నేను ఓ నిర్ణయానికి వచ్చాను.. అనేక కష్టాల తర్వాత 2011లో పోలీస్ ఉద్యోగం రావడంతో జీవితంలో మార్పు వచ్చింది.. 2015లో వివాహమై.. ఇద్దరు పిల్లలు పుట్టారు.. ఓ కుటుంబం ఉండాలనే నా కల చివరకు నెరవేరింది.. కానీ, కోవిడ్ మా జీవితాల్లో పెను విషాదం నింపింది.. 2021లో నా భార్య మరణంతో కుప్పకూలిపోయాను.. కానీ, నా కొడుకు, కూతురు భవిష్యత్తు కోసం బలంగా నిలబడాలని భావించాను.. వారికి తల్లిలేని లోటులేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను.. నా కూతురికి ఐదేళ్లు.. నా కొడుక్కి ఆరేళ్లు నిండాయి.. రోజూ వారికి ఇష్టమైనవి వండిపెడతాను.. స్కూల్‌కు రెడీచేస్తాను.. తల్లిలా తండ్రి పెంచలేడని అందరూ అన్నారు... కానీ, నేనూ, నా బిడ్డలు అది తప్పని నిరూపించాం’’ అని సందర్భంగా ఓ తండ్రి చెప్పిన తన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రయాణంలో సువేంద్ మరో లక్ష్యాన్ని చేరుకున్నారు. సువెందు తన జీవితాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. ఆయన కంటెంట్ అంతా తన పిల్లలతో గడిపే రోజువారీ క్షణాల చుట్టూ అల్లుకుని ఉంటుంది. బహుశా అందుకే అతని కథ చాలా మందికి చేరువవుతోంది. ఎందుకంటే, ఆయన నవ్వు వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ‘‘చిన్నప్పటి నుంచి కుటుంబం అంటే నిజంగా ఏమిటో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. నాకు తల్లి ప్రేమ గానీ, తండ్రి ప్రేమ గానీ ఎప్పుడూ లభించలేదు. నా భార్య కూడా ఇప్పుడు నాతో లేదు.. కానీ, ఈ రోజు, నేను ఒంటరిని కాను, ఎందుకంటే నా ప్రపంచమంతా నా పిల్లల్లోనే చూస్తున్నాను’’ అని భావోద్వేగంతో అన్నారు. ఆయన ప్రయాణం, పిల్లలను తల్లులు మాత్రమే పెంచగలరనే లోతుగా పాతుకుపోయిన నమ్మకాన్ని కూడా సవాలు చేస్తోంది. ‘‘తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని నాకు తెలుసు... కానీ ఒక తండ్రి నిజంగా ప్రయత్నిస్తే, తన పిల్లలకు సర్వస్వం కాగలడు.. తల్లే కాదు, తండ్రి కూడా ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, వృత్తి జీవితాన్ని సొంతంగా నిర్వహించుకోగలరని నేను సమాజానికి చూపించాలనుకుంటున్నాను’’అని పేర్కొన్నారు. అతని కథలో మనసును కదిలించే విషయం ఉంది. తల్లిదండ్రులు లేకుండా పెరిగిన ఒక బిడ్డ.. తన పిల్లలకు అమ్మగా మారారు.