ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత సోమవారం రోజు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఈ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం అనే పేరుతో ఈ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 12 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో.. ఈ పుష్కర కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన చేసిన కృషి, జాతీయ సమైక్యతపై జనసేన భావజాలం వంటి అంశాలను ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ నేతలకు వివరించనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి.. జనసేన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ముఖ్య నేతలు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళం నుంచి ఇటీవల పార్టీలో చేరిన సభ్యులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా ఎలా నిలబడాలనే దానిపై చర్చించనున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యంగా నిలవాల్సిన అవసరంపై నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు. ఢిల్లీలోని అశోక హోటల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఆదివారమే ఢిల్లీ వెళ్తున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. నాలుగున్నర గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రాత్రి 6:40 గంటలకు ఢిల్లీకి చేరుకున్న తర్వాత నేరుగా తాజ్ హోటల్‌కు వెళ్లనున్నారు. ఈ సమావేశానికి ఎందుకంత ప్రాధాన్యం.. తెలంగాణ గడ్డపై జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. గత ఎన్నికల్లో కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ అవతలికి కూడా విస్తరించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జనసేన పార్టీ తన కార్యకలాపాలను పెంచింది. మొన్నటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన ఎపిసోడ్ తర్వాత తెలంగాణలో పలువురు నేతలు.. జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణతో పాటుగా కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీలోకి చేరికలు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలోనే జనసేన ఢిల్లీ సమావేశం ద్వారా తమ జాతీయవాద భావజాలాన్ని ప్రదర్శించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఎన్డీఏ కూటమిలో జనసేనను బలమైన పార్టీగా.. దక్షిణాదిలో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యనేతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేదీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.