నిన్నటి దాకా 75 రూపాయల పార్టీ.. నేడు లోక్‌‌సభలో కింగ్‌మేకర్! ఎన్‌సీపీఐ చరిత్ర ఇదే

Wait 5 sec.

నిన్నటిదాకా ఓ చిన్న రాజకీయ పార్టీగా ఉన్న నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) ఇప్పుడు ఒక్కసారిగా భారత రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్‌లో చెలరేగిన తిరుగుబాటులో ఎన్‌సీపీఐ వార్తల్లో నిలిచింది. 2023 లెక్కల ప్రకారం రూ. 75 నగదు మాత్రమే ఉన్న ఈ పార్టీ ఇప్పుడు లోక్‌సభలో కింగ్‌మేకర్‌గా మారనుంది. బెంగాల్‌లో రాజకీయ సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్‌లో చీలికలు ఏర్పడ్డాయి. 20 మంది లోక్‌సభ సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఎన్‌సీపీఐలో విలీనం అవుతామని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల విలీనాన్ని స్పీకర్ ఆమోదిస్తే ఇప్పటి వరకు పెద్దగా రాజకీయ ప్రభావం లేని ఎన్‌సీపీఐ ఒక్కసారిగా లోక్‌‌సభలో ఐదో అతిపెద్ద పార్టీగా, ఎన్డీయేలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా అవతరించే అవకాశం ఉంది. తిరుగుబాటు ఎంపీలంతా కలిసి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి సభలో తమకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. మూడింట రెండొంతుల మద్దతు కూడా తమకు ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) 2023 జనవరిలో భారత ఎన్నికల సంఘం వద్ద నమోదయింది. ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం ఈ పార్టీ కార్యాలయం పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా సంకరైల్ ప్రాంతంలో ఉంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదిక ప్రకారం పార్టీకి మొత్తం రూ. 1,13,075 విరాళాల రూపంలో వచ్చాయి. దాదాపు పార్టీ మొత్తం నిధులు ఖర్చు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి పార్టీ ఖజానాలో కేవలం రూ. 75 మాత్రమే మిగిలిందని ప్రకటించింది. 2023లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పార్టీ ఖర్చుల్లో దాదాపు రూ. 49,400ను వినియోగించింది. ఇది పార్టీ తొలి ఎన్నికల ప్రయత్నాల్లో ఒకటిగా చెబుతున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షెవ్లీ కుండు రూ. 15 వేల విరాళం ఇవ్వగా, ఉపాధ్యక్షుడు ఉత్తియా కుండు రూ. 18 వేల విరాళం అందించారు. 2023 - 24, 2024 - 25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన విరాళాలు, ఆడిట్ నివేదికలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో లేవు. మొత్తానికి రూ. 75 నగదుతో ఉన్న చిన్న పార్టీ ఇఫ్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఆసక్తికరంగా మారింది.