సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌పై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. మహిళలపై అసభ్యకరంగా, తప్పుడు వ్యాఖ్యలు చేయడం క్షమించరాని చర్య అని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎవరి కుమార్తె అయినా ఆమెను అవమానించే విధంగా ఇలా ప్రస్తావించడం సరికాదని యోగి పేర్కొన్నారు.యూపీలోని ఆజంగఢ్‌లో రూ.955 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ ఈ అంశంపై స్పందించారు. ఇటీవల అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్న యోగి ఆదిత్యనాథ్.. ఈ విషయం తెలిసిన వెంటనే సంబంధిత వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించానని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.కుమార్తె ఎవరైనా కుమార్తెనే అని.. తమ సంస్కృతిలో గ్రామంలోని ఒక అమ్మాయి అందరి కుమార్తె, అందరి సోదరిగా భావిస్తామని.. ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవని సీఎం యోగి తేల్చి చెప్పారు. అఖిలేష్ యాదవ్ కుమార్తెను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు, దుష్ప్రచార పోస్టులు ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.కొందరు వ్యక్తులు అఖిలేష్ యాదవ్ కుమార్తె ఫోటోను మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో తెగ వైరల్ చేశారు. ఆ ఫోటోతో పాటు పూర్తిగా అవాస్తవమైన, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలను ఎక్స్‌లో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ నాయకులు పోలీసులను ఆశ్రయించగా.. కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ సెల్‌లో కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్‌కు కూడా యోగి ఆదిత్యనాథ్ పలు సూచనలు చేశారు. మహిళలు, వృద్ధులు, సీనియర్ నేతలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయకుండా ఎస్పీ కార్యకర్తలను అఖిలేష్ కంట్రోల్ చేయాలని హితవు పలికారు. ఇతరులకు సలహాలు ఇచ్చే అఖిలేష్.. ఎస్పీ అనుచరులు, కార్యకర్తలు కూడా సంయమనంతో మాట్లాడేలా చూడాలని పేర్కొన్నారు. ముందుగా వారు అర్థం చేసుకునేలా చెప్పండి అని.. వారు వినకపోతే తమకు అప్పగించండి అని తెలిపారు. తాము సరైన విధంగా అర్థం చేసేలా చేస్తామని యోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా సమాజ్‌వాదీ పార్టీలోని గూండా సంస్కృతిపై యోగి పరోక్షంగా విమర్శలు గుప్పించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.