వర్షాకాలం రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి .. సంబంధిత శాఖల అధికారులతో తాజాగా కీలక సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో చర్చించారు. వర్షాలు రాకముందే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. వానలు పడినప్పుడు సరిగ్గా పనిచేయాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గతంలోనే సమీక్ష నిర్వహించి.. వర్షాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణపై కీలక సూచనలు చేసినప్పటికీ.. ఆ తర్వాత వర్షం కురిసినప్పుడు సరిగ్గా నిర్వహణ చేయలేదని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వర్షం పడినప్పుడు అధికారుల అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జూన్ 1వ తేదీనే సంబంధిత అధికారులకు ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ.. జూన్ 9వ తేదీన కురిసిన వర్షానికి.. క్షేత్రస్థాయిలో అధికారులు సరిగా పనిచేయలేదని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. వారిపై మండిపడ్డారు. మున్సిపల్, పోలీస్ విభాగాల మధ్య సమన్వయ లోపాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఇక నుంచి వర్షం పడే సమయంలో.. ట్రాఫిక్ ఉన్నతాధికారుల దగ్గరి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు.. ప్రతీ ఒక్కరు రోడ్లపైనే ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరం అయితే వర్షం పడినప్పుడు తాను కూడా రోడ్డు పైకి వస్తా అంటూ అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని.. నీరు నిలిచిపోయే ప్రాంతాలు, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి.. అందుకు సరైన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మానవ తప్పిదాల వల్ల కారణంగా ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే.. అస్సలు సహించేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండని అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమంయలో ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే సమయంలో తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్వహణ మాన్యువల్‌ ప్రకారం జరగాలని తేల్చి చెప్పారు. సంబంధిత సీఈలు, ఎస్‌ఈలు స్థానికంగా అందుబాటులో ఉండాలని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణతోపాటు.. గేట్ల మరమ్మతులకు వెంటనే నిధులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.