ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో యూజీ నీట్ 2026ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం రద్దుచేసింది. ఈ ప్రభావం 22 లక్షల మంది విద్యార్థులపై పడింది. ఈ కుంభకోణం మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రారంభమైంది. అక్కడ పేపర్ మొదటి డిజిటల్ కాపీ బయటపడింది. నివేదికల ప్రకారం.. పుణేకు చెందిన అనుమానితుడి నుంచి లీక్ అయిన పేపర్‌ను కొనుగోలు చేసి, ఆపై దానిని రూ. 5 లక్షల లాభంతో విక్రయించాడనే ఆరోపణలపై నాసిక్‌కు చెందిన శుభమ్ ఖైర్నార్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అదుపులోకి తీసుకుంది.మహారాష్ట్ర తర్వాత హర్యానాలోని గురుగ్రామ్, రాజస్థాన్‌లోని ప్రధాన కోచింగ్ సెంటర్ జైపూర్, సికార్ అలాగే జమ్మూ కశ్మీర్, బీహార్, కేరళతో సహా అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. నాసిక్‌లోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల శుభమ్ ఖైర్నార్ బీఏఎంఎస్ విద్యార్థి. లీకైన నీట్ పర్‌ను పుణేకు చెందిన అనుమానితుడి నుంచి రూ.10 లక్షలకు కొనుగోలు చేసి హర్యానాలోని ఓ వ్యక్తికిి రూ.15 లక్షలకు విక్రయించి రూ.5 లక్షల లాభం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా పేపర్ సర్క్యులేట్ అయిందని నివేదికలు చెబుతున్నాయి.మంగళవారం మధ్యాహ్నం శుభమ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. తనను గుర్తించకుండా జుత్తు కత్తిరించి తన రూపురేఖలను మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే, అధికారుల ముందు అతడి ప్రయత్నాలు ఫలించలేదు. సాంకేతికత సాయంతో అతడిని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న తరువాత... తండ్రి మధుకర్ ఖైర్నార్ తన కొడుకుపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. పేపర్ లీక్ రాకెట్‌తో శుభమ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. కానీ, నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.పేపర్ లీక్‌లో పోర్టబుల్ స్కానర్‌లు, క్లిష్టమైన టెలిగ్రామ్ నెట్‌వర్క్, షాడో సర్వర్‌లతో సహా అధునాతన సాంకేతికతలను ఉపయోగించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. నివేదికల ప్రకారం, పరీక్షకు దాదాపు 45 గంటల ముందు పేపర్ సర్క్యులేట్ అయ్యింది. కేరళలో చదువుతున్న సికార్‌ విద్యార్థి హాస్టల్ నడుపుతున్న తన తండ్రికి "గెస్ పేపర్" పీడీఎఫ్ పంపినట్లు ఆరోపణలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.పరీక్ష రోజు ఉదయం హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు పేపర్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. వారు అప్పటికే సెంటర్లకు వెళ్లిపోయారని సమాచారం. పరీక్ష ముగిసిన తర్వాత, పేపర్‌ను కెమిస్ట్రీ, బయాలజీ లెక్చర్లకు చూపించడంతో 108 కెమిస్ట్రీ ప్రశ్నలకు 45, 204 బయాలజీ ప్రశ్నలకు 90 అసలు పరీక్ష పేపర్‌తో సరిపోలింది. సికార్‌లోని కొన్ని కోచింగ్ కేంద్రాలు గెస్ పేపర్స్ ఉపయోగించి నీట్‌కు సిద్ధం కావాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కొందరికి పీడీఎఫ్ కాపీలు అందగా, మరికొందరికి లీకైన పేపర్‌కి సంబంధించిన అసలు కాపీలు ఇచ్చినట్లు సమాచారం.ఫిర్యాదు చేయడానికి ఉపాధ్యాయులు ప్రయత్నించినా.. సికర్ పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీంతో వారు నేరుగా NTAకి మెయిల్ పంపడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)కి సమాచారం అందించింది. చివరకు రాజస్థాన్ పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు చేపట్టడంతో గుట్టు బయటపడింది.