ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజధాని విషయంలో తగ్గేదే లే అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతే రాజధాని అని సీఎం చంద్రబాబు తేల్చి చెబుతుండగా.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగన్ (మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరు) రాజధాని వ్యాఖ్యలకు జగన్ కట్టుబడి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లిలో నిర్వహించిన వీబీజీ రామ్‌జీ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని అని.. ఇక్కడే శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడని తెలిపారు. ఆయన ఆశీస్సులతో అమరావతి రాజధాని అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉందంటూ ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు అసెంబ్లీలో అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన వైసీపీ.. తర్వాత వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త వాదన తీసుకొస్తున్నారని విమర్శలు గుప్పించారు. అయితే ప్రజల రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన చంద్రబాబు.. దానిపై ఎలాంటి సందేహం అవసరం లేదని తేల్చి చెప్పారు.ఇక ఏళ్లుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి విడుదల అవుతున్నాయని చెప్పిన చంద్రబాబు.. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్‌ను సాధించామని.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా కాపాడినట్లు చెప్పారు. ఇక రాయలసీమను ఇకపై రాళ్లసీమ కాదు.. రత్నాల సీమగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఈ లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. రాయలసీమలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టే బాధ్యత తమదేనని చెప్పారు.జమ్మలమడుగులో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్‌కు త్వరలోనే శంకుస్థాపన చేసి.. నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో పుట్టపర్తిలో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీ ప్రాజెక్టు కూడా రానుందని తెలిపారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తయారీతో ఇప్పటికే రాయలసీమకు ప్రత్యేక గుర్తింపు ఉందని.. ఇకపై మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.