ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ రూ.3వేలు కట్టక్కర్లేదు, పూర్తి వివరాలివే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇకపై జీవనోపాధి కోసం తీసుకునే రుణాలకు సంబంధించి బ్యాంకులు విధించే ఛార్జీలపై ఊరట కల్పించింది. ఇటీవల బ్యాంకర్లతో నిర్వహించిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఛార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా సంఘాల రుణాలపై ప్రాసెస్, ఇన్‌స్పెక్షన్‌ ఛార్జీల రద్దు చేస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఛార్జీల విషయంలో ఇప్పటికే ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.. తాజాగా జులై 1 నుంచి యూనియన్‌ బ్యాంకు ప్రాసెస్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 11 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి.. ఈ సంఘాలలో కూడా అత్యధికంగా 3 లక్షల సంఘాలు యూనియన్‌ బ్యాంకు పరిధిలో ఉన్నాయి. ఈ సంఘాలలో దాదాపుగా 30 లక్షల మంది సభ్యులు ఉన్నారు. గతంలో యూనిన్ బ్యాంకు రూ. 10 లక్షల దాటిన క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రతి రూ. లక్షకు రూ. 350 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు ఉండేది. అదే రూ. 5లక్షలు దాటిన టర్మ్‌లోన్‌పై 1.30% ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేసేవారు. రూ. 5లక్షలు దాటిన ప్రతి లోన్‌అకౌంట్‌పై త్రైమాసికానికి రూ. 500తో పాటు జీఎస్టీని ఇన్‌స్పెక్షన్‌ ఛార్జీ కింద తీసుకునేవారు.. తాజాగా ఇవన్నీ రద్దు చేశారు.ఒక్కో డ్వాక్రా సంఘం రూ. 20 లక్షలు రుణం తీసుకుంటే.. బ్యాంకులు ఈ ఛార్జీలు మినహాయించడంతో ఏడాదికి రూ. 33వేల లబ్ధి జరుగుతుంది. డ్వాక్రా సంఘంలో 10మంది సభ్యులుంటే ఒక్కొక్కరికీ రూ. 3,300 వరకు ఆదా అవుతుంది. మూడేళ్లలో తీసుకున్న రుణం రూ. 20 లక్షలు నెల వాయిదాలుగా చెల్లిస్తే.. మొత్తం రుణం చెల్లించేనాటికి ఒక్కో సభ్యురాలికి రూ. 9,900 లబ్ధి పొందొచ్చు. ఇలా చూస్తే యూనియన్ బ్యాంక్‌ పరిధిలో ఉన్న 3లక్షల సంఘాల్లోని మహిళలకు దాదాపుగా రూ. 1000 కోట్ల లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ తర్వాత చూస్తే ఎక్కువ మంది గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నారు. డ్వాక్రా మహిళలు మొత్తం 20 బ్యాంకుల పరిధిలో రుణాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చార్జీల మినహాయింపు అంశంపై ఆయా బ్యాంకు అధికారుల్ని సెర్ప్‌శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటుగా అధికారుల్ని సంప్రదిస్తున్నారు. ఈ ఛార్జీల అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఎస్‌ఎల్‌బీసీ సబ్ కమిటీ నియమించారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బ్యాంకర్లు డ్వాక్రా మహిళలకు ఊరట కల్పించారు. ఇకపై రుణాలపై విధించే ఛార్జీలు ఉండవు.. త్వరలోనే మిగిలన బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరికి రూ. 3వేలకుపైగా ఆదా అవుతుంది.