హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న కనుగొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించుతోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాతావరణ మార్పుల తీవ్రతకు అనుగుణంగా ఆటోమెటిక్‌గా స్పందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ మహానగర పరిధిలోని అన్ని ట్రాఫిక్‌ సిగ్నళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఐటీ హబ్‌గా దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మౌలిక వసతుల ఆధునీకరణ అత్యంత అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.ఈ విషయమై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ కేంద్రంలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక సంస్థ అనలాగ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్‌ కిప్‌మాన్‌తో పాటు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్ పి.పి. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతికతతో పైలట్‌ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టేందుకు అనలాగ్‌, మేఘా సంస్థల సంయుక్త భాగస్వామ్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలోనే ప్రతినిధులు ఈ పత్రాలపై సంతకాలు చేశారు.ఈ సమావేశంలో నెక్స్ట్‌ జెనరేషన్‌ ఇంటెలిజెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సరికొత్త పరిష్కారాలపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రికి వివరించారు. అత్యాధునిక ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ వినియోగించడం వల్ల నగర రవాణా వ్యవస్థల ముఖచిత్రం ఎలా మారబోతోందో లైవ్ డెమో ద్వారా చూపించారు. ఈ సరికొత్త ఏఐ సాంకేతికత కాకుండా.. నగరంలోని భూగర్భ నీటి పైపుల లీకేజీలను ముందస్తుగా గుర్తించి మరమ్మతులు చేయడానికి, అవసరానికి అనుగుణంగా వీధి దీపాలు, ఇతర ప్రభుత్వ విభాగాల్లో విద్యుత్‌ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి ఎంతో తోడ్పడుతుందని వివరించారు.అన్నింటికంటే ముఖ్యంగా, అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించే అంబులెన్సులు, సమాజ రక్షణకు వెళ్లే అగ్నిమాపక వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా మార్గం సుగమం చేయడానికి ఈ ఇంటెలిజెంట్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. హైదరాబాద్ మహానగరం దేశంలోనే అత్యుత్తమ స్మార్ట్ రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా నిలుస్తుందని రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరగా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.