PM Kisan: రైతుల పెట్టుబడిని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ రైతు బ్యాంకు ఖాతాలో పడిన డబ్బులు చూసి షాక్ అవ్వాల్సి వచ్చింది. ప్రతి సంవత్సరం రైతులకు రూ.6000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులను మూడు విడతల్లో రూ.2000 చొప్పున జమ చేస్తోంది. బెంగల్ పర్యటన సందర్భంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. రైతులు రూ.2000 కోసం వేయి కళ్లతో ఎదురుచూడగా ఖాతాల్లో డబ్బులు పడడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నారు. మరి మహారాష్ట్ర రైతులుకు రూ.2000లకు బదులు ఎంత పడింది?మహారాష్ట్రకు చెందిన ఓ రైతు తనకు రావాల్సిన 23వ విడత నిధులు రూ.2000 కోసం ఎదురుచూడగా తన బ్యాంకు ఖాతాలో కేవలం 1 పైస పడింది. బ్యాంక్ నుంచి మొబైల్‌కు ఒక రూ.0.01 (ఒక్క పైసా) పడినట్లు మెసేజ్ వచ్చింది. ప్రభుత్వ సాయం ఇలా పైసల్లో రావడంపై సదరు రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగిందంటే? పీఎం కిసాన్ నిధి నుంచి రూ.2000 రావాల్సి ఉండగా అందుకు బదులుగా రూ.0.01 పైసా పడినట్లు బ్యాంక్ మెసేజ్ పంపించింది. ఖరీఫ్ సీజన్ మొదలైన క్రమంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తుండగా బ్యాంక్ మెసేజ్ చూసి షాక్ అయ్యామని సదరు రైతు కొడుకు ఖేమరాజ్ గిరెపంజీ మీడియాకు తెలిపారు. ఈ విషయంపై భందారా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సంగీత మానే క్లారిటీ ఇచ్చారు. రూ.0.01 మెసేజ్ అనేది బ్యాంక్ వ్యవస్థలోని టెక్నికల్ గ్లిచ్ వల్ల వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. అధికారిక రికార్డుల ప్రకారం రైతు బ్యాంకు ఖాతాలో రూ.2000 పడినట్లు వెల్లడించారు. వ్యవసాయ అధికారులు రూ.2000 పడినట్లు క్లారిటీ ఇవ్వడంతో సదరు రైతు ఊపిరిపీల్చుకోవాల్సి వచ్చింది. పీఎం కిసాన్ నిధుల పేమెంట్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. సమస్య అనేది ఎస్ఎంఎస్ వరకేనని, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌లో ఎలాంటి లోపం లేదని తెలిపారు.