సింగపూర్‌కు మన మామిడి పండ్లు.. సీఎం నియోజకవర్గం నుంచే టన్నుల్లో ఎగుమతి!

Wait 5 sec.

ఆంధ్ర మామిడి పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం ఫేమస్. నూజివీడు రసాలు, ఉలవపాడు మామిడికాయ, చిత్తూరు తోతాపురి, ఇక బంగినపల్లి గురించయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మన మామిడి పండ్లకి యమా గిరాకీ ఉంది. తాజాగా సింగపూర్‌కు మన మామిడి పండ్లను టన్నుల కొద్దీ ఎగుమతి మొదలైంది. సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గం నుంచే ఈ ఎగమతి మొదలవ్వడం విశేషం. చిత్తూరు జిల్లాలో తోతాపురి, బంగినపల్లి మామిడి కాయలు ఎక్కువ కాపు కాస్తాయి. కర్ణాటక పరిధిలోని చింతామణి ప్యాక్ హౌస్ నుంచి ఐదు టన్నుల మామిడి పండ్లతో ఉన్న కంటైనర్ చెన్నై ఓడరేవుకు బయల్దేరింది. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, సీఐఎస్‌హెచ్ సహకారంతో బంగినపల్లి, తోతాపురి మామిడి పండ్లను నౌక ద్వారా సింగపూర్‌కు పంపుతున్నట్లు ఓసమ్ ఫుడ్స్ డైరెక్టర్ వ్యవసాయ పారిశ్రామికవేత్త కోటేశ్వరరావు తెలిపారు. READ ALSO కుప్పం నియోజకవర్గంలోని మండలాలతో పాటు పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట మండల రైతుల నుంచి సేకరించిన మామిడిని సింగపూర్‌కు పంపినట్లు వారు తెలిపారు. ఈ మామిడి పండ్లను మొత్తాన్ని ఓ కంటైనర్‌లో ఉంచి, షిప్‌లో సింగపూర్‌కు పంపుతున్నారు. మామిడి పండ్లు సింగపూర్‌కి చేరుకోవడానికి 12 రోజుల సమయం పడుతుంది. ఈ 12 రోజుల పాటు మామిడి పండ్లు చెడిపోకుండా ఉండేవిధంగా 12 డిగ్రీల సెల్షియస్‌తో వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. రైతుల దగ్గర నుంచి మేలిమిజాతి మామిడి పండ్లను మంచి ధరకే కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. కిలో తోతాపురి రూ. 50, బంగినపల్లి కిలో రూ. 120 చొప్పున కొనుగోలు చేశారు. గత నెల 9న ఐదు టన్నుల బంగినపల్లి మామిడిని సింగపూర్‌కు పంపగా.. రవాణా, ఇతర ఖర్చులు పోనూ కిలోకు రూ. 40 మిగిలిందని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక పరిధిలోని ప్యాక్ హౌస్ నుంచి పంపించాల్సి వస్తుందని.. అదే ప్యాక్ హౌస్ కుప్పం ప్రాంతంలో ఉంటే చిత్తూరు జిల్లా నుంచి విదేశాలకు మంచి మామిడిపండ్లు పంపే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.