తెలంగాణలో అత్యంత కీలకమైన కేంద్ర రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. యాదగిరిగుట్ట–కాజీపేట స్టేషన్ల మధ్య ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 3వ, 4వ రైల్వే లైన్ల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి, పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కాంపిటెంట్ అథారిటీని నియమించింది. ఈ ప్రాజెక్టు జనగామ జిల్లా పరిధి గుండా వెళ్లనున్న నేపథ్యంలో.. జిల్లాలోని జనగామ, ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన రెవెన్యూ డివిజనల్ అధికారులకు కాంపిటెంట్ అథారిటీలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.యాదగిరిగుట్ట నుంచి కాజీపేట మధ్య మొత్తం 77.96 కిలోమీటర్ల పొడవునా మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ పరిపాలనాపరమైన ఆమోద ముద్ర వేసింది. ఘట్‌కేసర్ నుంచి యాదగిరిగుట్ట మధ్య 32.45 కిలోమీటర్ల మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ రైల్వే ప్రాజెక్టు భూసేకరణ, అమలు, నిర్వహణ, యాజమాన్య వ్యవహారాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు రైల్వే చట్టం–1989లోని సెక్షన్ 2 (7ఏ) ప్రకారం ఈ నియామకాలు జరిగాయి. గెజిట్ నోటిఫికేషన్ అధికారికంగా ప్రచురితమైన తేదీ నుంచే సదరు ఆర్డీవోలు ఈ ప్రత్యేక బాధ్యతలను స్వీకరించినట్లు పరిగణించాల్సి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ మోతీలాల్ భూక్యా స్పష్టం చేశారు.ఈ క్వాడ్రప్లింగ్, డబ్లింగ్ పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడనుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ప్రయాణికుల రద్దీ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా.. పారిశ్రామిక, వాణిజ్య రంగానికి ఊతమిస్తూ రైల్వేల ద్వారా జరిగే సరుకు రవాణా మరింత వేగవంతంగా, సులభతరంగా మారేందుకు ఈ అదనపు రైల్వే లైన్లు దోహదపడతాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ట్రైన్ లైన్లు అందుబాటులోకి వస్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునే భక్తులకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఘట్‌కేసర్- యాదగిరిగుట్ట కారిడార్ పూర్తయితే హైదరాబాద్ నగరం నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులకు రోడ్డు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడమే కాకుండా.. తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో కనెక్టివిటీ భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల కేటాయింపులు, భూసేకరణ, వివిధ నిర్మాణ పనులు వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నాయి.