తెలంగాణలోని పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. PMAY-U 2.0 కింద ఇళ్లు మంజూరు

Wait 5 sec.

తెలంగాణలో సొంతింటి కలలు కంటున్న తీపి కబురు అందించింది. ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-పట్టణ (PMAY-U) 2.0 పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరో 8,338 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇటీవల దిల్లీలో నిర్వహించిన సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర నివేదికలు, ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం రూ.125.07 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా పనులు ప్రారంభించడానికి తొలి విడత కింద రూ.50.02 కోట్లను తక్షణమే విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది.ఒకవైపు కొత్త ఇళ్లను మంజూరు చేస్తూనే.. -యు, పీఎంఏవై-యు 2.0 పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంలో, లబ్ధిదారులకు నిధులు చేరవేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని కేంద్రం వేలెత్తి చూపింది. పీఎంఏవై-యు మొదటి దశ కింద చేపట్టిన పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను రాబోయే సెప్టెంబరు 30 లోపు వంద శాతం పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటిన తర్వాత జరిగే ఎటువంటి నిర్మాణ పనులకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేదా సబ్సిడీలు అందబోవని కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.కేంద్ర నివేదికల ప్రకారం.. గతంలో పీఎంఏవై-యు 2.0 కింద మంజూరు చేసిన రూ.173.58 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.63.98 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. అలాగే ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం రూ.112.64 కోట్లు కేటాయించగా.. రాష్ట్రం అందులో రూ.54.79 కోట్లు మాత్రమే ఉపయోగించుకుంది. బడ్జెట్ నిధులు మూలన పడి ఉండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిధుల వినియోగంలో వేగం పెంచాలని సూచించింది. దీంతో పాటు కేంద్రం తరఫున మొత్తం 28,930 మంది లబ్ధిదారులకు నిధులు మంజూరైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 14,343 మందికి మాత్రమే ఆ సాయాన్ని పంపిణీ చేసిందని మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా సొమ్మును త్వరితగతిన బదిలీ చేయాలని ఆదేశించింది.సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ విధానంపై కూడా కేంద్రం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బీఎల్‌సీ ఇళ్ల నిర్మాణాన్ని గరిష్టంగా 12 నుండి 18 నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తి కావడానికి ముందే ఆయా లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి పౌరసౌకర్యాలను కల్పించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఈ మౌలిక వసతులు కల్పించిన తర్వాతే కేంద్రం నుంచి మూడవ వాయిదా నిధులను క్లెయిమ్ చేయాలని సూచించింది. అలాగే పీఎంఏవై-యు 2.0 నూతన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక సమగ్ర ఆఫర్డబుల్‌ హౌసింగ్ పాలసీని సిద్ధం చేయాలని ఆదేశించింది.రాష్ట్రంలో గతంలో అఫర్డబుల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ కింద నిర్మించిన ఇళ్ల నిర్వహణపై కూడా కేంద్రం సమీక్ష జరిపింది. తెలంగాణలో ఇప్పటివరకు 1,36,125 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. అందులో కేవలం 92,241 ఇళ్లలో మాత్రమే లబ్ధిదారులు చేరారు. మౌలిక వసతుల కొరత లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల దాదాపు 43 వేలకు పైగా ఇళ్లు ఇంకా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. మిగిలిన ఇళ్లలోకి కూడా లబ్ధిదారులు త్వరగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అలాగే, పాత పథకంలో ఇంకా ఖర్చు కాకుండా మిగిలిపోయిన రూ.103.23 కోట్ల నిధులను యుద్ధప్రాతిపదికన వెచ్చించి ప్రాజెక్టులను ముగించాలని తెలంగాణ గృహ నిర్మాణ శాఖకు కేంద్రం సూచనలు చేసింది.