ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విద్యుత్‌ సంస్థల్లో పదవీ విరమణ వయోపరిమితి పెంపుపై ఉత్తర్వుల అమలును పరిశీలించేందుకు అధ్యయనానికి కమిటీని నియమించారు. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీపీసీసీ ఛైర్మన్‌ విజయానంద్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీపీసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఇటీవల ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్ని విద్యుత్ సంస్థల్లో కూడా అమలు చేసే అంశాన్ని ఈ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ పరిశీలించనుంది. ఈ మేరకు ఏపీపీసీసీ (ఏపీ పవర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని.. 15 రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ కమిటీ నివేదిక రాగానే విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జీవో జారీ చేసింది.ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. గతంలో కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలియజేయగా.. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2022 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసి ఉంటే.. వారిలో అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. కాకపోతే మళ్లీ ఉద్యోగంలో చేరే వరకు ఉన్న గ్యాప్‌ పీరియడ్‌కు జీతం ఉండదని స్పష్టత ఇచ్చారు. ఈ గ్యాప్ పీరియడ్‌ను సీనియారిటీ, ప్రమోషన్ల కోసం పరిగణనలోకి తీసుకోరు. అయితే ఈ ఉత్తర్వుల్ని విద్యుత్ సంస్థల్లో అమలు చేసే అంశంపై అధ్యయనం కోసం కమిటీని నియమించారు.