చాబహార్ పోర్టు నుంచి వెనక్కి తగ్గినా.. అమెరికా దాడులతో భారత్‌కు ఎదురుదెబ్బే

Wait 5 sec.

అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలతో మరోసారి పశ్చిమాసియా వేడెక్కింది. ఇరాన్‌తో ఒప్పందం ముగిసినట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేశారు. వరుసగా మూడో రోజు ఇరాన్‌పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా వైమానిక దాడులతో చాబహర్ పోర్టులో భారత్ చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు సమీపంలోని ఆగ్నేయ ఇరాన్‌ ఆగ్నేయ ప్రావిన్సు సిస్తాన్ బలూచిస్థాన్‌లో చాబహార్ పోర్టు ఉంది. దీని ద్వారా అంతర్జాతీయ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌‌ను ఉపయోగించి పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా అఫ్గన్, పశ్చిమాసియాకు భారతీయ వస్తువులను రవాణా చేయవచ్చు. అమెరికా తాజాగా దాడులతో భారత్ చేపట్టిన చాబహార్ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.కొన్నేళ్ల కిందట అయితే ఇలాంటి దాడి భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విదేశీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకదానికి నేరుగా ముప్పుగా పరిణమించేది. కానీ ఈ రోజు పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. మరోసారి అమెరికా ఆంక్షల నేపథ్యంలో, చాబహార్ ఫ్రీ జోన్‌లోని తన వాటాను ఒక స్థానిక ఇరాన్ సంస్థకు భారతదేశం తాత్కాలికంగా బదిలీ చేయడంతో, ఇప్పుడు ఈ ఓడరేవును భారత్ నేరుగా నిర్వహించడం లేదు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడినప్పుడు తిరిగి వచ్చే అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంటూనే, దాదాపు 120 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆంక్షల నుంచి రక్షణ కల్పించడం కోసం భారత్ ఈ చర్య చేపట్టింది. భవిష్యత్తులో ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు పొందడం కోసం అమెరికాతో భారత్ తెరవెనుక దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది.ఇరాన్‌తో చారిత్రక ఒప్పందం2024లోపై సంతకం చేసినప్పుడు, చాబహార్ పోర్టు పట్ల భారతదేశ నిబద్ధత మరింత బలపడినట్లు కనిపించింది. అయితే, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఇరాన్‌పై అమెరికా తిరిగి విధించిన ఆంక్షలు, ఈ ప్రాజెక్టును కొనసాగించే భారతదేశ సామర్థ్యాన్ని సంక్లిష్టం చేశాయి. కేంద్ర బడ్జెట్ 2026-27లో చాబహార్‌ పోర్టు కొత్త కేటాయింపులు చేయనప్పటికీ, కేవలం ఆ ఒక్క కారణంతో ఈ ప్రాజెక్టు నుంచి భారత్ వైదొలగుతుందని భావించలేము. దానికి బదులుగా, న్యూఢిల్లీ మరింత అప్రమత్తంగా అడుగులు వేసే విధానాన్ని అవలంభించింది.నివేదికల ప్రకారం, ఆంక్షల నుంచి పెట్టుబడిని కాపాడుకుంటూనే, ఆస్తులు కార్యకలాపాలు కొనసాగించడానికి వీలుగా చాబహార్ ఫ్రీ జోన్‌లోని తన వాటాను భారత్ తాత్కాలికంగా ఒక స్థానిక ఇరాన్ సంస్థకు బదిలీ చేసింది. ఈ చర్య వల్ల అమెరికా ఆంక్షల నుంచి భారత పెట్టుబడికి రక్షణ లభించడంతో పాటు అక్కడ ఆస్తులు యథావిధిగా పనిచేసే అవకాశం లభించింది. భౌగోళిక రాజకీయ నష్టాలు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ప్రత్యక్ష యాజమాన్యం అవసరం లేకుండా భారత్ దీర్ఘకాలిక ప్రయోజనాలను సమర్థవంతంగా కాపాడుతుంది.అమెరికా దాడి ప్రభావంతాజా అమెరికా దాడుల వల్ల భారత్ తక్షణ కార్యాచరణ నష్టాన్ని చవిచూసిందని చెప్పలేం. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రత్యక్ష నిర్వహణ నుంచి వైదొలగడంతో భారత కార్యకలాపాలకు తక్షణ అంతరాయం పరిమితంగా ఉండే అవకాశం ఉంది. కానీ, వ్యూహాత్మకంగా చూస్తే అతిపెద్ద ఆందోళన నెలకుంది. చాబహార్‌తో ముడిపడి ఉన్న ప్రతి ఉద్రిక్తత ఈ ప్రాజెక్టు భవిష్యత్తును మరింత అనిశ్చితిలోకి నెట్టేస్తోంది. ఒకప్పుడు అఫ్గనిస్థాన్, పశ్చిమాసియా, రష్యాలకు భారతదేశ ముఖద్వారంగా మారుతుందని భావించిన ఈ ఓడరేవు, ఇప్పుడు ఆంక్షలు, సైనిక అస్థిరత అనే రెండు సవాళ్లను ఎదుర్కొంటోంది. భౌతిక నష్టం పరిమితంగా ఉన్నప్పటికీ, సంఘర్షణ భద్రతాపరమైన ప్రమాదాలను పెంచుతుంది. వాణిజ్య కార్యకలాపాలను నిరుత్సాహపరుస్తుంది. భవిష్యత్ పెట్టుబడి నిర్ణయాలను గణనీయంగా కష్టతరం చేస్తుంది.భారత్ ఆందోళనచాబహార్ దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ అనిశ్చితి వలయంలో చిక్కుకుపోతుందేమో అనేది భారత్‌కు ఉన్న పెద్ద ఆందోళన. అదే గనుక జరిగితే ఈ ప్రాజెక్టు ప్రారంభానికి మూలకారణమైన ప్రాంతీయ అనుసంధానం (కనెక్టివిటీ) ఆశయాల్లో జాప్యం కావచ్చు లేదా పూర్తిగా దెబ్బతినవచ్చు.ఇప్పటికే ఆంక్షల నుంచి తప్పించుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అవలంబించినందున, అమెరికా దాడులు చాబహార్‌లోని భారత ప్రస్తుత కార్యకలాపాలను నేరుగా ప్రభావితం చేయకపోవచ్చు. కానీ ఈ దాడి భారత్ దీర్ఘకాలిక వ్యూహాత్మక అంచనాలకు ఒక ఎదురుదెబ్బే. చాబహార్ కేవలం భారత్‌కు మరో విదేశీ ఓడరేవు మాత్రమే కాదు. అది పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా ఇతర మార్కెట్‌లలోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం. ప్రాంతీయంగా పెరుగుతున్న చైనా ప్రభావానికి అడ్డుకట్టే వేసే వ్యూహాత్మక శక్తి.. యూరేషియాతో అనుసంధాన వ్యూహానికి ఒక మూలస్తంభం. ఎటువైపు చూసినా భవిష్యత్తులో ఈ ఓడరేవు ద్వారా భారత్‌కు గణనీయమైన ప్రయోజనం ఉంది. అక్కడ తలెత్తే ఎలాంటి అస్థిరత అయినా.. భారతదేశ భవిష్యత్తు లక్ష్యాన్ని పునరుద్ధరించడం మరింత కష్టతరమవుతుంది.