పోలవరం జనసేన పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసైనికుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తాజాగా ఎమ్మెల్యేపై ట్రోల్స్, సోషల్ మీడియాలో పోస్టుల ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే బాలరాజు సతీమణి జ్యోతి వర్సెస్ జనసైనికుడి మధ్య వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఎమ్మెల్యే భార్య జ్యోతి గురువారం ఉదయం అనుచరులతో కలిసి కొయ్యలగూడెం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ ఇంటికి వెళ్లారు. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ఎందుకు పోస్టులు పెడుతున్నారని ప్రశ్నించారు. ఎవరో పంపిన పోస్టుల్ని తాను మరొకరికి షేర్ చేశానని సతీష్ వివరణ ఇచ్చారు.. ఎమ్మెల్యే భార్యకు సారీ చెప్పారు. ఆ క్షమాపణలు తమ ఇంటికి వచ్చి చెప్పాలని జ్యోతి అన్నారు.వెంటనే జ్యోతి వెంట వచ్చిన అనుచరులు సతీష్‌ను వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత అతడ్ని కారులో కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.. సతీష్ కారు దిగగానే పరిగెత్తుకుంటూ పీఎస్‌లోపలికి వెళ్లాడు. తనపై దాడి చేశారని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడే ఉన్న జనసేన నేతలు అతడ్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే బాలరాజు భార్య జ్యోతి కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. సోషల్ మీడియా వేదికగా తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది.ఎమ్మెల్యే భార్య జ్యోతి కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌కు వచ్చారని తెలిసి కొంతమంది జనసైనికులు అక్కడకి వెళ్లారు. జ్యోతి కారు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. సతీష్‌పై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు చెప్పడంతో జనసైనికులు శాంతించారు. అంతకముందు సతీష్‌ను కొటికలపూడి గోవిందరావు ఆసుపత్రిలో పరామర్శించారు. అలాగే సతీష్‌పై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని గోవిందరావు పోలీసులకు సూచించారు. ఇదిలా ఉంటే తనపై హత్యాయత్నం జరిగిందని సతీష్‌ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అసలు ఈ వివాదానికి కారణమైన సోషల్ మీడియా పోస్ట్‌లో ఏముందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే దంపతుల వ్యక్తిగత విషయాల గురించి సతీష్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.పోలవరం జనసేన పార్టీలో కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఇటీవల ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యాఖ్యానించారు. కొంతమంది పెత్తందారులు తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పనులు చేయనివ్వడం లేదని ఘాటుగా స్పందించారు. కొందరు తన ఎదుగుదలను చూడలేక కుట్రలు చేస్తున్నారని.. ఇంతకాలం అన్ని భరిస్తూ వచ్చానని.. ఇక వారిని వదిలేది లేదన్నారు. గతవారం ఎమ్మెల్యే న‌డిరోడ్డుపై కారు టాప్ ఎక్కి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను పెట్టబోయే వ్యక్తి గెలవకపోతే తన పేరు బాలరాజు కాదంటూ సవాల్ చేశారు. పోలవరం నియోజకవర్గంలో దొరల పాలన పోవాలంటూ కామెంట్స్ చేశారు. మొత్తం మీద పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో వర్గపోరు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.