ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది.. ఏపీలో పార్టీలకు అతీతంగా చేతులు కలుపుదాం.. వైఎస్ షర్మిల

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లాలో కరోనా లక్షాణాలున్న వారితో పాటుగా కొందరికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఓ ఇద్దరు చనిపోగా.. మరికొందరికి వైద్యం అందిస్తున్నారు. కడపలోని రిమ్స్‌‌లో కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తిని తమిళనాడు వేలూరు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కడపలో ఒకరికి లక్షణాలు ఉన్నట్టు తేలడంతో శాంపిల్స్ సేకరించి పుణె ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుత కడప రిమ్స్‌లోని వార్డులో ఒకరు చికిత్స పొందుతున్నారని.. వీరి శాంపిల్స్ కూడా పరీక్షకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. మరికొందరిలో కరోనా లక్షణాలు ఉన్నాయని.. ప్రజలు మాస్క్‌ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. తాజాగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్పందించారు. గడిచిన రోజుల్లో చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ కేసులు పాజిటివ్ నిర్ధారణ కావటమే కాకుండా మరణాలు సంభవించాయన్న వార్తలు తీవ్రంగా కలచివేశాయన్నారు. ఈ విషయంపై కడప జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ విషయం తీవ్రత, యంత్రాంగం సన్నద్ధత గురించి తెలుసుకున్నానన్నారు. ప్రభుత్వం అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతున్నానన్నారు. అన్ని ముఖ్యమైన చర్యలు, ప్రతిచర్యలు తీసుకుని, లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి, పరీక్షలు, ప్రత్యేక వార్డులు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు షర్మిల.'అలాగే కాంగ్రెస్ జిల్లా స్థాయి నాయకులకు, కార్యకర్తలకు అత్యంత అప్రమత్తత, జాగ్రత్త తీసుకుంటూ, అతి ముఖ్యంగా వృద్ధులూ, పిల్లలూ, తీవ్ర, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గమనిస్తూ, వారికి సహాయసహకారాలు అందిస్తూ, యంత్రాంగంతో సమన్వయము చేసుకోవాల్సిందిగా ఆదేశించాము. మళ్లీ కోవిడ్ ప్రబలకుండా పార్టీలకతీతంగా చేతులు కలుపుదాం' ని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల. మొత్తం మీద ఏపీలో, అందులోనూ కడప జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.