తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన (TRS) అనే పేరును రిజిస్టర్ చేయడం కుదరదని స్పష్టం చేస్తూ ఈసీ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేరుపై ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఎలక్షన్ కమిషన్ తన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో రాబోయే పదిహేను రోజుల వ్యవధిలో పార్టీకి సంబంధించి మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని కవితకు సూచించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కొత్త పేర్లను ప్రతిపాదించకపోతే.. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్న దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అనే పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ ఈసీ పంపిన లేఖపై కల్వకుంట్ల కవిత ధీటుగా స్పందించారు. ఈసీ లేఖపై స్పందిస్తూ.. తమకు అధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన రెండు ప్రధాన అభ్యంతరాలకు తాము ఇప్పటికే చట్టబద్ధంగా సమాధానాలు ఇచ్చామని ఆమె వెల్లడించారు. తాము చట్టపరిధిలోనే ఈ పేరును ఎంచుకున్నామని, కాబట్టి కొత్త పేర్లను ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేయడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని కవిత స్పష్టం చేశారు. ఈ పేరు వివాదంతో ప్రస్తుతం ఆమె కొత్త పార్టీ అధికారిక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి.భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత తండ్రితో, బీఆర్ఎస్ పార్టీతో విభేదించి ఇటీవల కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన చారిత్రాత్మక తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరును కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లకు టీఆర్‌ఎస్ అనే మూడు అక్షరాల పేరుతో ఉన్న సుదీర్ఘ భావోద్వేగ బంధాన్ని తిరిగి సొంతం చేసుకోవాలనే పక్కా వ్యూహంతోనే కవిత ఈ పేరును ఎంచుకున్నారు.తెలంగాణ సమాజంలో ఇంకా బలంగా ఉన్న పాత టీఆర్‌ఎస్ సెంటిమెంట్‌ను, గులాబీ జెండా గుర్తింపును మళ్లీ తన వైపు తిప్పుకోవాలని కవిత భావించారు. ఇందుకోసం 'తెలంగాణ రక్షణ సేన అనే పేరును పెట్టి.. దాని సంక్షిప్త నామం మళ్లీ TRS వచ్చేలా ఆమె ప్లాన్ చేశారు. తద్వారా పాత క్యాడర్‌ను ఆకర్షించడంతో పాటు, భవిష్యత్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందవచ్చని ఆమె అంచనా వేశారు. కానీ.. ఒకే రకమైన సంక్షిప్త నామాలు, పాత పార్టీల పేర్లను పోలిన గుర్తులు ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయనే కారణంతో ఈసీ దీనిపై బ్రేకులు వేసింది. ఇప్పుడు కవిత వెనక్కి తగ్గకుండా కోర్టుకు వెళ్తామని ప్రకటించడంతో ఈ ఇష్యూ ఉత్కంఠగా మారింది.