ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ నెల నుంచి ఆర్టీసీ డిపోల్లోని బస్‌పాస్ కౌంటర్ల దగ్గర ఉచిత, రాయితీ బస్ పాస్‌ల పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులు బస్‌పాస్‌ల కోసందరఖాస్తులు పూర్తిచేసి అవసరమైన పత్రాలు ఆర్టీసీ సిబ్బందికి సమర్పించి బస్ పాస్‌ పొందవచ్చు. దరఖాస్తు ఫారమ్‌లో పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ప్రిన్సిపల్, హెడ్‌మాస్టర్ సంతకం చేయించి స్టాంప్ వేయాలి. అంతేకాదు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఉచిత బస్‌పాస్‌లు12 ఏళ్లలోపు ఏడో తరగతి చదివే బాలబాలికలు, 18 ఏళ్లలోపు పదో తరగతి చదివే వారికి ఉచితంగా బస్‌ పాసులు ఇస్తారు. విద్యార్థుల ఇంటి నుంచి స్కూల్, కాలేజీ 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే మాత్రమే ఈ పాసు జారీ చేస్తారు.ఈ బస్ పాస్‌లు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు బస్సుల్లో చెల్లబాటవుతాయి. ఈ పాస్‌ల కోసం విద్యార్థులు అప్లికేషన్లు పూర్తిచేసి పాస్‌పోర్టు సైజు ఫొటో అంటించి హెడ్ మాస్టర్ సంతకం, స్టాంపు వేయించాలి.. స్టడీ సర్టిఫికెట్ కూడా కలిపి ఆధార్ కార్డు జిరాక్స్‌తో డిపోలో అందజేయాలి. నామినేషన్ ఐడి కార్డు కోసం రూ.50 చెల్లించాలి. రాయితీ బస్‌పాస్‌లుఆర్టీసీ నెల, మూడు నెలలు, ఏడాదికి చెల్లుబాటయ్యేలా విద్యార్థులకు 33శాతం రాయితీతో స్టూడెంట్ పెయిడ్ పాస్‌లు జారీ చేస్తోంది. ఈ బస్ పాస్‌ల కోసం స్కూల్, కాలేజీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు చదివే స్కూల్, కాలేజీలకు మధ్య దూరం 50 కిలోమీటర్ల లోపు ఉంటే ఈ పాస్‌లు ఇస్తారు. విద్యార్థి ఇంటి నుంచి కాలేజీ, స్కూల్ ఉన్న దూరాన్ని బట్టి బస్‌పాస్ ధర ఉంటుంది. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, తిరుమల, పుత్తూరు, పలమనేరు, కుప్పం, మంగళం, అలిపిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, వాకాడు, సూళ్లూరుపేట డిపోల్లో పాసులు మంజూరు చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.. దీని కోసం ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.. అప్పుడు ఓ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. అది ప్రింట్ తీసుకుని ప్రిన్సిపల్, హెడ్‌మాస్టర్ సంతకం పెట్టించి డిపోలో అందజేసి పాస్ తీసుకోవచ్చు.