హైదరాబాద్ ప్రజలకు, పర్యాటక ప్రేమికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలోని హుస్సేన్‌సాగర్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే బోటింగ్ సౌకర్యంతో సందర్శకులను ఆకట్టుకుంటున్న హుస్సేన్‌సాగర్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణను జోడిస్తూ సరస్సు చుట్టూ ఆధునిక సర్క్యులర్ స్కైవాక్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ స్కైవాక్ ద్వారా సందర్శకులు హుస్సేన్‌సాగర్ మధ్యలోని ప్రపంచ ప్రసిద్ధ ఏకశిల బుద్ధ విగ్రహాన్ని సరికొత్త కోణంలో వీక్షించే అవకాశం పొందనున్నారు. సాయంత్ర వేళల్లో సరస్సు అందాలు, నగర వెలుగులు, బుద్ధ విగ్రహం ఒకే వేదికపై కనిపించేలా ఈ ప్రాజెక్టును రూపొందించనున్నట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ టూరిజానికి మరో కొత్త గుర్తింపు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఇదే సమయంలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని కూడా అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్కడ అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం, హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. బుద్ధుడి జీవిత ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు, మహాస్థూపం, ఇతర ఆకర్షణలను మరింత విస్తరించి పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 274 ఎకరాల్లో విస్తరించిన బుద్ధవనాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దనున్నారు.అంతేకాకుండా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భారీ మట్టి బౌద్ధ స్తూపం నిర్మించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే ఫణిగిరి, బుద్ధవనం, నేలకొండపల్లి, హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహాన్ని కలుపుతూ ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.వీకెండ్ టూరిజాన్ని ప్రోత్సహించేలా ఒక రోజు, రెండు రోజుల ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశీయ పర్యాటకులతో పాటు విదేశాల నుంచి వచ్చే బౌద్ధ యాత్రికులను ఆకర్షించేలా ప్రత్యేక బౌద్ధ, జైన టూరిజం సర్క్యూట్లను రూపొందించనుంది. ఈ ప్రాజెక్టులు అమలైతే రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.