పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో శాసన సభ ఎన్నికలను బహిష్కరించినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ జూలై 27న జరగనున్న ఈ ఎన్నికలను బహిష్కరించింది. విషయంలో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. కశ్మీర్ ప్రజల ఐక్యతను చాటడానికి, వారికి మద్దతుగా ఉన్నామని తెలిపేందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పీటీఐ తెలిపింది. స్వతంత్ర, న్యాయబద్ధమైన, ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఏర్పడే వరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోమని.. ఇది ఎలాంటి రాజకీయ స్వలాభం కోసం కాదని, కేవలం అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించడానికే అంటూ పార్టీ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలకు పీటీఐ మద్దతు ప్రకటించింది. పాకిస్థాన్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పీటీఐ పీఓకే ప్రజలకు మద్దతు ప్రకటించడంతో అక్కడి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. జూన్ 5న హింసాత్మక నిరసనల నేపథ్యంలో పీఓకే ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేఏఏసీపై నిషేధం విధించింది. READ ALSO పీఓకే వ్యవహారం ఇప్పుడు రోజురోజుకూ ముదురుతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో ఉన్న రావలాకోట్ ఈద్‌గాహ్ మైదానంలో వేలాది మంది పాల్గొని, భారీ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్థాన్‌లో భాగంగా కాదని, తమకు పాకిస్థాన్ అవసరం లేదని, పాకిస్థాన్‌కే పీఓకే అవసరం ఉందంటూ జేఏఏసీ నాయకుడు సర్దార్ అమ్మాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఇదే తీరు కొనసాగిస్తే మరో మార్గాన్ని వెతుక్కోవాల్సి వస్తుందంటూ భారత్‌తో సంబంధాలపై సర్దార్ సంకేతాలు ఇస్తూ హెచ్చరికలు జారీ చేశారు. గత మూడు వారాలుగా రావలాకోట్‌లో వేలాది మంది నిరసనకారులు ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు పాక్ ప్రభుత్వం నిత్యావసర సరఫరాలను అడ్డుకుంటోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 27న జరగనున్న ఎన్నికలను పీటీఐ బహిష్కరించింది.