100 రోజుల్లో 185 కేసులు.. కల్తీ ఆహారంపై హెచ్-ఫాస్ట్ పంజా.. 121 టన్నుల ఆహార పదార్థాలు సీజ్

Wait 5 sec.

హైదరాబాద్‌లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై పోలీసులు భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో నాసిరకం, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన () టీమ్ కేవలం 100 రోజుల్లోనే సంచలన ఫలితాలు సాధించింది. మార్చి 19వ తేదీ నుంచి చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 185 కేసులు నమోదు చేసి.. 121 టన్నులకుపైగా కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఆధ్వర్యంలో 36 మంది సభ్యులతో పనిచేస్తున్న హెచ్ ఫాస్ట్ బృందం జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఆహార తయారీ కేంద్రాలు, గోదాములు, ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలు, హాస్టల్ కిచెన్లు, వాటర్ ప్లాంట్లపై విస్తృతంగా దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే అనేక ఆహార పదార్థాలు వెలుగులోకి రావడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.స్వాధీనం చేసుకున్న వాటిలో 27 వేల కిలోల నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్, 25 వేల కిలోల రసాయనాలతో కృత్రిమంగా పండించిన పండ్లు.. 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలు, 15 టన్నుల నాసిరకం మాంసం.. 9,260 కిలోల నిల్వ పచ్చళ్లు.. కల్తీ ఖోవా, టీ పొడి, పన్నీర్, క్రీమ్, నెయ్యి, పెరుగు వంటి పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా పన్నీర్ తయారీలో ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ప్రాంతాల వారీగా చూస్తే రాజేంద్రనగర్ జోన్‌లో అత్యధికంగా 55 కేసులు, గోల్కొండలో 44, సికింద్రాబాద్‌లో 35, చార్మినార్‌లో 21, శంషాబాద్‌లో 13, జూబ్లీహిల్స్‌లో 12, ఖైరతాబాద్‌లో 5 కేసులు నమోదయ్యాయి. అదనంగా మరో 247 కేసులను ఫుడ్ సేఫ్టీ విభాగానికి తదుపరి చర్యల కోసం బదిలీ చేశారు.ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కల్తీ ఆహార వ్యాపారులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీ ఆహారం వల్ల చిన్నారుల ఎదుగుదల దెబ్బతినడంతో పాటు క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఎఫ్ఎస్‌ఎస్ఏఐ లైసెన్స్ కలిగి ఉండాలని తేల్చి చెప్పారు. సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించాలని, వాడిన వంటనూనెను మళ్లీ ఉపయోగించకూడదని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వ్యాపార సంస్థలను వెంటనే సీజ్ చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీ ఆహారంపై ప్రజలు ఇచ్చే సమాచారంతోనే అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయని, అనుమానాస్పద ఆహార తయారీ లేదా విక్రయాలపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.