భారత్‌తో యుద్ధానికైనా సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక, ముదురుతోన్న సింధూ జలాల వివాదం

Wait 5 sec.

భారత్ - పాక్ మధ్య మళ్లీ హీట్ మూమెంట్ మొదలైంది. పహల్గాం అటాక్ తర్వాత సింధూ జలాల వివాదం తెరపైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పాక్ జల భద్రతకు ముప్పు ఏర్పడితే భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమంటూ ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్‌లోని ఓ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్ తమ నీటి సరఫరాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని అనిపిస్తే సైనిక చర్యకు పాల్పడుతామని హెచ్చరించారు. తమ జాతీయ భద్రతకు, ముఖ్యంగా నీటి భద్రతకు ముప్పు ఏర్పడిందని భావించిన క్షణంలో యుద్ధానికైనా వెళ్తామన్నారు. పాకిస్థాన్‌ను వచ్చే నీటి సరఫరాను భారత్ అడ్డుకుంటుందని ఆధారాలు లభించినా తాము యుద్ధం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఆ తర్వాత భారత్ 1960 నాటి ఇండస్ వాటర్ ట్రిటీ అమలును నిలిపివేసింది. పాకిస్థాన్‌ మద్దతుగా ఉన్న ఉగ్రవాద సంస్థలే పహల్గాం అటాక్‌కు కారణమని భారత్‌ ఆరోపిస్తూ, 1960 నాటి ఒప్పందాన్ని నిలిపేసింది. సరిహద్దు దాటి జరిగే ఉగ్రదాడులను పూర్తిగా అరికట్టే వరకూ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. సింధూ జలాల వ్యవహారంపై భారత్ నీటిన ఆయుధంగా ఉపయోగిస్తోందంటూ ఖ్వాజా ఆసిఫ్ ఆరోపణలు చేశారు. చీనాబ్ నది ప్రవాహాలను నియంత్రించడం, అవసరమైన సమాచారం ఇవ్వకపోవడం వంటి చర్యలు చేస్తున్నట్లు ఆయన విమర్శిస్తున్నారు. ఇదే సింధూ జలాల వ్యవహారంపై భారత్ ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో తన నిర్ణయాన్ని తెలిపింది. భారత ప్రతినిధి అనుపమా సింగ్ ఐరాసలో మాట్లాడుతూ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశం.. స్నేహంపై ఆధారపడిన హక్కులను ఆశించలేదంటూ చెప్పారు. సింధూ జలాల ఒప్పందానికి ఎప్పుడో కాలం చెల్లిందని ఆమె నొక్కి చెప్పారు. పాకిస్థాన్‌లో నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఈ వివాదానికి మళ్లీ తెరలేపారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.