: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కిందటి రోజు (జూన్ 23) భారీగా పడిపోయాయి. ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి దారితీశాయి. ఇదే సమయంలో ఏఐ ఆధారిత స్టాక్స్‌ విలువ ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళనల నేపథ్యంలో దక్షిణ కొరియా స్టాక్ ఇండెక్స్ పతనం కావడం కూడా కారణంగా ఉంది. దీంతో సెన్సెక్స్ కిందటి రోజు ఏకంగా 900 పాయింట్ల వరకు పతనమైంది. నిఫ్టీ 280 పాయింట్లు తగ్గింది. ఇక్కడ పలు ఐటీ స్టాక్స్ పడిపోయాయి. ఇదే సమయంలో దేశంలోని అతిపెద్ద మైనింగ్, సహజ వనరుల సంస్థల్లో ఒకటైన దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంతా లిమిటెడ్ షేర్లలో భారీ పతనం కనిపించింది. మంగళవారం (జూన్ 23) సెషన్‌లో 7.73 శాతం తగ్గి రూ. 282.20 వద్ద స్థిరపడింది. అంతకుముందు సెషన్‌లో రూ. 305.85 వద్ద క్లోజ్ అవగా జూన్ 23న దాదాపు 4 శాతం నష్టంతో రూ. 294.50 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగకుండా ఇంట్రాడేలో 8 శాతానికిపైగా తగ్గి రూ. 279 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు రూ. 282.20 వద్ద సెషన్ ముగించింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని చెప్పొచ్చు. సంస్థ మార్కెట్ విలువ రూ. 1.05 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 360, కనిష్ఠ ధర రూ. 151.20 గా ఉంది. గత నెల వ్యవధిలో ఈ స్టాక్ దాదాపు 15 శాతం పతనమైంది. తర్వాత కంపెనీ 5 వేర్వేరు స్టాక్స్‌గా విభజన చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్టాక్ పడిపోయేందుకు ప్రధాన కారణం బ్లాక్ డీల్.అవును వేదాంతా లిమిటెడ్ ప్రమోటర్ సంస్థ ట్విన్ స్టార్ హోల్డింగ్స్ తన వాటాను కొంత మేర బ్లాక్ డీల్ ద్వారా విక్రయించినట్లు మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. దాదాపు 7.3 కోట్ల షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇది మొత్తం వాటాలో దాదాపు 1.7 శాతానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 292 చొప్పున విక్రయించగా దాదాపు రూ. 2149 కోట్లు సమకూర్చుకున్నట్లు సమాచారం. ట్విన్ స్టార్ హోల్డింగ్స్‌కు సంస్థలో దాదాపు 40 శాతం వాటా ఉంది. ఇదే అతిపెద్ద ప్రమోటర్ షేర్ హోల్డర్. వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధుల్ని తన పేరెంట్ కంపెనీ వేదాంతా రిసోర్సెస్ రుణాల్ని తగ్గించుకునేందుకు ఉపయోగించనున్నట్లు తెలిసింది. ఇక బ్లాక్ డీల్ అంటే సాధారణ ట్రేడింగ్ సమయం కంటే కాస్త ముందుగా స్పెషల్ విండో ద్వారా రెండు వర్గాల మధ్య జరుగుతుంది. ముందుగా నిర్ణయించిన ధర ప్రకారమే షేర్ల కొనుగోళ్లు, విక్రయాలు నిర్వహిస్తుంటారు. ఈ బ్లాక్ డీల్‌లో కనీసం 5 లక్షల షేర్లు లేదా రూ. 5 కోట్ల విలువైన లావాదేవీ జరగాల్సి ఉంటుంది. వీటి వివరాలు సెబీకి తెలపాల్సి ఉంటుంది.