బంగారంతో సౌదీ వెళ్తున్నారా? ఇకపై కొత్త నిబంధనలు.. అలాచేస్తే బుక్కవుతారు

Wait 5 sec.

సౌదీ అరేబియాలో ప్రవేశించే.. విడిచి వెళ్లే ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే బంగారం, నగదు పరిమితులపై కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. మనీల్యాండరింగ్ నిరోధక చట్టాలను మరింత కఠినతరం చేసిన సౌదీ.. గతంలో ఉన్న 60,000 రియాల్స్ డిక్లరేషన్ పరిమితిని తగ్గించింది. ప్రస్తుతం దానిని 40,000 రియాల్స్‌కు తగ్గించింది. ఈ కొత్త నిబంధనల ద్వారా జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీకి అధికారాలు దఖలుపడ్డాయి. ఈ నిబంధనల ప్రకారం.. ఎవరైనా 40,000 సౌదీ రియాల్స్ (దాదాపు రూ. 10 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువ విలువైన నగదు, బంగారం, రత్నాలు లేదా ఆభరణాలు తీసుకెళ్తే తప్పనిసరిగా కస్టమ్స్ అధికారులకు లిఖితపూర్వక డిక్లరేషన్ సమర్పించాలి. వాటి కొనుగోలుకు సంబంధించిన ఇన్వాయిస్‌లను కూడా వారికి చూపించాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొనక తప్పదని అధికారులు హెచ్చరించారు. సరైన వివరాలు వెల్లడించకపోతే సదరు వస్తువులను 72 గంటల పాటు తాత్కాలికంగా జప్తు చేస్తారు. తొలిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి, స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువలో 10- 25 శాతం వరకు జరిమానా విధిస్తారు. మనీల్యాండరింగ్ ఉద్దేశం లేదని నిర్ధారణ కావాలి. ఇది పునరావృతమైతే ఈ జరిమానాను 50 శాతానికి పెంచే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేరపూరిత ఉద్దేశాలు ఉన్నట్లు అనుమానిస్తే, సదరు కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేస్తారు.ఒకవేళ ఆ వస్తువులు వాణిజ్య అవసరాల కోసం తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తిస్తే.. వాటికి 'యూనిఫైడ్ కస్టమ్స్ లా' నిబంధనలు వర్తిస్తాయని ఒకాజ్ పత్రిక నివేదించింది. ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలలో రిస్క్-ఆధారిత విధానాన్ని మరింత విస్తృతం చేశారు. దీని ప్రకారం... ఆర్థిక సంస్థలు, నిర్దేశిత ఆర్థికేతర వ్యాపారాలు, వృత్తిపరమైన సంస్థలు తమ కస్టమర్లు, ఉత్పత్తులు, సేవలు, వారు వ్యాపారం చేసే దేశాలు, లావాదేవీల సరళిపై క్రమం తప్పకుండా మనీలాండరింగ్ రిస్క్ అసెస్‌మెంట్ (ప్రమాద విశ్లేషణ) నిర్వహించాల్సి ఉంటుంది.ఈ సంస్థలు ఆయా నివేదికలను డాక్యుమెంట్ చేయడంతో పాటు క్రమంగా అప్‌డేట్ చేయాలి. అలాగే, బ్యాంకు ఖాతాలు లేదా నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలు జరపడానికి ముందే... కస్టమర్ల గుర్తింపు, లబ్ధిదారుల యాజమాన్యం, నిధుల మూలాలు, వ్యాపార సంబంధాల ఉద్దేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది.ఈ నిబంధనలు భారత్ సహా ఇతర గల్ఫ్ దేశాలకు ప్రయాణించే వారిపై ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి. తమ వెంట తీసుకెళ్లే విలువైన వస్తువులు, ఆభరణాలకు సంబంధించిన అసలు పత్రాలను భద్రపరుచుకోవాలని, ప్రయాణానికి ముందు ఒకసారి నిబంధనలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.