కేబీఆర్ పార్కు తరహాలో గుర్రంగూడ ఫారెస్ట్ ఎకో పార్కు.. రూ.15 కోట్లతో, ప్రత్యేకతలివే..!

Wait 5 sec.

హైదరాబాద్ నగర శివారులోని గుర్రంగూడ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అత్యాధునిక హంగులతో సరికొత్త ఎకో పార్కు ఏర్పాటుకు అటవీశాఖ ముమ్మర కార్యాచరణ ప్రారంభించింది. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కును తలపించేలా.. అన్ని రకాల అధునాతన సౌకర్యాలతో ఈ పార్కును రూపొందించనున్నారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత నివేదికను ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు. సుమారు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ఎకో పార్కు పనులను ఈ ఏడాది డిసెంబరులోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు గడువుగా నిర్దేశించుకున్నారు.గుర్రంగూడ రిజర్వ్‌ ఫారెస్ట్‌ మొత్తం 424 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. అందులో 142 ఎకరాలను ప్రత్యేకంగా ఎకో పార్కు అభివృద్ధి కోసం కేటాయించారు. ఈ పార్కులో సందర్శకుల కోసం సైక్లింగ్‌ ట్రాక్‌లు, ఆహ్లాదకరమైన వాక్‌వేలు, ప్రశాంత వాతావరణంలో యోగా చేసుకునేందుకు ధ్యానమందిరాలను నిర్మించనున్నారు. అలాగే వివిధ అధికారిక, అనధికారిక సమావేశాల నిర్వహణకు వేదికలు, సందర్శకులు కూర్చుని మాట్లాడుకునేందుకు వీలుగా పచ్చిక బయళ్లలో ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. రోజుకు సుమారు 30 వేల మంది సందర్శకులు వచ్చినా తట్టుకునేలా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వందలాది మంది ఒకేసారి వస్తే ప్రవేశ ద్వారాల వద్ద రద్దీ ఏర్పడకుండా ఉండేందుకు వీలుగా పార్కుకు ఐదు వేర్వేరు చోట్ల ప్రధాన ప్రవేశ ద్వారాలను నిర్మిస్తున్నారు. వారాంతాల్లో కుటుంబాలతో గడిపేవారి కోసం ప్రత్యేక యాక్టివిటీ జోన్లు, పిల్లల వినోదం కోసం ప్లేజోన్లను కూడా సిద్ధం చేస్తున్నారు.గతంలో గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ భూములంటూ ఆక్రమించుకుని కోర్టులను ఆశ్రయించి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి డాక్టర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కస్నా నాయక్‌లు లీగల్ టీమ్‌తో కలిసి పక్కా ఆధారాలు సేకరించారు. ప్రైవేటు వ్యక్తులు కోర్టులో సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని నిరూపించడంలో వారు విజయం సాధించారు. దీంతో ఆ భూములు పూర్తిగా అటవీశాఖవేనని స్పష్టం చేస్తూ గతేడాది సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు అనంతరం అటవీశాఖ ఆక్రమణలను తొలగించి రికార్డులను సరిచేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గుర్రంగూడ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి దక్కించుకున్న 116 ఎకరాల భూమిని స్పష్టంగా గుర్తిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణల నుంచి విముక్తి పొందిన ఈ అటవీ భూమి ఇప్పుడు నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని పంచే అద్భుతమైన హరితవనంగా మారబోతోంది.