పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అడుగు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. భారత్‌కు గట్టి సంకేతాలేనా..?

Wait 5 sec.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్, బంగ్లా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇండియా పట్ల వ్యతిరేకతను నూరిపోసే శక్తులు ఆ దేశంలో బలం పుంజుకున్నాయి. ఆ దేశానికి తాత్కాలిక పాలకుడిగా వ్యవహరించిన మొహమ్మద్ యూనస్ సైతం భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నించారు. చైనా, పాకిస్థాన్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇటీవల ఎన్నికల్లో తారిక్ రెహ్మాన్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడతాయనే ఆశలు చిగురించాయి.అయితే బీఎన్‌పీ ప్రభుత్వం సైతం పాకిస్థాన్‌తో స్నేహానికే మొగ్గు చూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌‌కు చెందిన 12 మంది సీనియర్ సివిల్ సర్వెంట్లు మిడ్ కెరీర్ ట్రైనింగ్ కోసం వెళ్లారు. ఒక అడిషనల్ సెక్రటరీ, 11 మంది జాయింట్ సెక్రటరీలు లాహోర్‌లోని సివిల్ సర్వెంట్ అకాడమీలో మే 4 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ పొందారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని పాకిస్థాన్ భరించింది.వాస్తవానికి బంగ్లాదేశ్‌కు చెందిన అధికారులు 2024 వరకు భారత్‌లో శిక్షణ పొందడానికి వచ్చేవారు. ముస్సోరీ అకాడమీలో వెయ్యి మందికిపైగా బంగ్లా సివిల్ సర్వెంట్లు శిక్షణ పొందారు. 2024 వరకు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో బంగ్లా సీనియర్ అధికారులు మిడ్ కెరీర్ ట్రైనింగ్ పొందేవారు. 2019-24 మధ్యే నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రాం కింద వెయ్యి మందికిపైగా బంగ్లాదేశీ సివిల్ సర్వెంట్లు భారత్‌లో శిక్షణ పొందారు. ఇటీవలి సంవత్సరాల్లో 2500 మంది బంగ్లాదేశ్ అధికారులు భారత్‌లోని వేర్వేరు సంస్థల్లో శిక్షణ పొందారు. కానీ 2024లో షేక్ హసీనా పదవిని కోల్పోయిన తర్వాత ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ తన అధికారులను శిక్షణ కోసం తొలిసారి పాకిస్థాన్‌కు పంపించింది. బంగ్లాదేశ్ తన దౌత్య సంబంధాలను, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని విస్తరించే పనిలో భాగంగా ఇలా చేస్తోందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్థాన్ కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తమ దేశ అధికారులను శిక్షణ కోసం పంపించడం బంగ్లా పాలకులకు సౌకర్యవంతంగా ఉంటే.. వారి నిర్ణయం వాళ్ల చేతుల్లోనే ఉంది అది విశ్లేషకులు చెబుతున్నారు.బంగ్లాదేశ్ భారత్‌ను కాదని పాకిస్థాన్‌ వైపు మళ్లుతుందా? లేదా దక్షిణాసియాలోని ఇతర దేశాలతోనూ సత్సంబంధాలను నెరపడంలో భాగంగా ఇలా చేస్తుందా అనేది కొంత కాలం ఆగితే తేలనుంది. ఒకటి మాత్రం నిజం.. ఇక నుంచి తమకు భారత్ తొలి ప్రాధాన్యం కాదనే సంకేతాలను బంగ్లాదేశ్‌ ఇస్తోంది. దీనికి భారత్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్, భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ ఇస్లామాబాద్ పట్ల వ్యతిరేకతను కనబర్చేది. అయితే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత.. ఇటీవలి కాలంలో ఢాకా పాలకులు పాకిస్థాన్‌కు దగ్గరవడం మొదలైంది. ఢాకా-కరాచీ మధ్య నేరుగా విమానాల రాకపోకలు మొదలయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన అత్యున్నత అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. పాకిస్థాన్-చైనా కలిసి తయారు చేసిన జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి కూడా బంగ్లాదేశ్ ఆసక్తి కనబరుస్తోంది.