విద్యార్థులు, తల్లిదండ్రులకు భారీ ఊరట.. పుస్తకాల ధరలు భారీగా తగ్గింపు

Wait 5 sec.

త్వరలోనే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులకు భారీ ఊరటను ఇచ్చే వార్త వచ్చింది. విద్యార్థుల పుస్తకాల ధరలు భారీగా తగ్గడం విశేషం. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి పాఠ్య పుస్తకాల ధరలు తగ్గడంతో.. ఆర్థికంగా కాస్త రిలీఫ్ లభించింది. గరిష్ఠంగా 20 శాతం వరకు ధరలు తగ్గడంతో విద్యార్థులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు యుద్ధం కారణంగా అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ.. పుస్తకాల ధరలు తగ్గడం గమనార్హం. అయితే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం కొన్ని రోజుల క్రితం పుస్తకాల ప్రింటింగ్ కోసం.. టెండర్లను పిలిచింది. ఈ టెండర్లలో 3 ప్రింటింగ్ సంస్థలు గతం కంటే 20 శాతం తక్కువగా కోట్‌ చేయడంతో పుస్తకాల ధరలు దిగి వచ్చాయి. గతంలో ఒక్కో పేజీ ప్రింటింగ్ ధర 54 పైసలు ఉండగా.. అది ప్రస్తుతం 44.50 పైసలకు దిగి వచ్చింది. ఉదాహరణకు 1వ తరగతిలోని 3 పుస్తకాలు కలిపి గతేడాది రూ.247లు కాగా.. ఈసారి రూ.209కి తగ్గాయి. ఇఖ 10వ తరగతిలోని మొత్తం 8 పుస్తకాల ధర గత విద్యా సంవత్సరంలో రూ.1,078 ఉండగా ఈసారి రూ.900కి తగ్గింది. అంటే.. ఒక్క టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈ ఏడాది రూ.178 ఆదా అయ్యాయి. జూన్‌ 5వ తేదీ నుంచి కొత్త పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు.. పుస్తకాల ధరలు తగ్గినంత మాత్రాన.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రింటింగ్‌లో, బైండింగ్‌లో ఎలాంటి రాజీ లేకుండా.. మెరుగైన క్వాలిటీతో లామినేటెడ్ పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక.. వరుసగా 4వ ఏడాది కూడా పాఠ్యపుస్తకాల ధరలు తగ్గడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పింది. 2023-24 అకడమిక్ ఇయర్‌లో 10వ తరగతి విద్యార్థుల పుస్తకాల కోసం రూ.1,482 ఖర్చు కాగా.. 2025-26లో అది రూ.1,078కు దిగి వచ్చింది. తాజా తగ్గింపుతో ఈ ఏడాది టెన్త్ టెక్స్ట్ బుక్స్ సెట్ ధర రూ.900కు తగ్గింది. అదే విధంగా 9వ తరగతి పుస్తకాల సెట్ ధర రూ.927 నుంచి రూ.776కు (రూ.151) తగ్గింది. 8వ తరగతి పుస్తకాల సెట్ ధర రూ.825 నుంచి రూ.690కి (రూ.135) తగ్గాయి. ప్రైమరీ క్లాసులకు కూడా ఒక్కో సెట్‌‌‌‌పై రూ.35 నుంచి రూ.60 వరకు ధరలు తగ్గాయి. ఇక సబ్జెక్టుల వారీగా పుస్తకాల ధర తగ్గింపు చూస్తే.. టెన్త్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ధర గతంలో రూ.225 ఉండగా.. ఇప్పుడు రూ.187కు తగ్గింది. సోషల్ పుస్తకం రూ.192 నుంచి రూ.160కి తగ్గింది. 9వ తరగతి మ్యాథ్స్ బుక్ రూ.201 నుంచి రూ.167కు.. 8వ తరగతి మ్యాథ్స్‌ రూ.205 నుంచి రూ.171కి తగ్గింది. అయితే గతం కంటే ఇప్పుడు.. ముడి సరుకుల ధరలు 20 శాతం పెరిగినప్పటికీ.. పబ్లిషర్లు మాత్రం గతేడాది కంటే తక్కువ ధరకే పుస్తకాలను ముద్రించేందుకు ముందుకు రావడం గమనార్హం. గతేడాది ఎల్1 గా నిలిచిన ఆర్క్‌‌బర్డ్ సంస్థ పేజీకి 54 పైసలు కోట్ చేయగా.. ఈ ఏడాది నవతెలంగాణ ప్రింటర్స్, డీకే పబ్లికేషన్స్, సూపర్ ప్రింటర్స్ సంస్థలు కేవలం 44.50 పైసలకే పుస్తకాలను ప్రింట్ చేస్తామని ప్రకటించి.. ఎల్-1గా నిలిచాయి.