: ఉపాధి కోసం సుదూర తీరాలకు వెళ్లి, అక్కడ ఇప్పుడిప్పుడే ఒక అందమైన సంసారాన్ని నిర్మించుకుంటున్న ఒక భారతీయ ప్రవాసి కుటుంబంలో ఊహించని రోడ్డు ప్రమాదం పూడ్చలేని శోకాన్ని నింపింది. "రాత్రి భోజన సమయానికి ఇంటికి వచ్చేస్తా" అని భార్యకు చెప్పి వెళ్లిన సదరు యువకుడు.. కొన్ని గంటల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. న్యూజీలాండ్‌లోని పాపామోవా ప్రాంతంలో రాత్రి వేళ ఉబర్ క్యాబ్ నడుపుతుండగా జరిగిన ప్రమాదంలో పంజాబ్‌కు చెందిన ఒక భారతీయ యువకుడు మరణించాడు. ఈ విషాద ఘటన స్థానికంగా ఉన్న ప్రవాస భారతీయులను తీవ్రంగా కలచివేసింది.క్యాబ్ నడుపుతుండగా ఘోర ప్రమాదం..'న్యూజీలాండ్ హెరాల్డ్' కథనం ప్రకారం.. భారత దేశంలోని పంజాబ్‌కు చెందిన రమణ్‌దీప్ 36 ఏళ్ల ధిల్లాన్ అనే వ్యక్తి గత బుధవారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లాడు. అతడు ఉబర్‌లో కారు నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. ఆరోజు కూడా పికప్ కోసం వెళ్లాడు. ఈక్రమంలోనే బెల్ రోడ్, పోప్లర్ లేన్ మధ్య గల 'టే పుకే హైవే'పై ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరొక వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో రమణ్‌దీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అవతలి వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.రమణ్‌దీప్ ధిల్లాన్ ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో 2015లో స్టూడెంట్ వీసాపై న్యూజీలాండ్ వెళ్లాడు. అనంతరం 2024లో స్వదేశానికి వెళ్లి వీర్‌పాల్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత ఈ దంపతులు ఇద్దరూ న్యూజీలాండ్ చేరుకుని పాపామోవాలో స్థిరపడ్డారు. అక్కడ వారిద్దరూ మొదట కివీఫ్రూట్ తోటల్లో కూలీలుగా పని చేసేవారు. వీరికి ప్రస్తుతం 18 నెలల (ఏడాదిన్నర) కుద్రత్ అనే కుమార్తె ఉంది. పాప పుట్టిన తర్వాత ఆమెను చూసుకోవడానికి వీలుగా ఉంటుందని.. సమయం కలిసి వస్తుందని రమణ్‌దీప్ పార్ట్ టైమ్‌ ఉబెర్ డ్రైవర్‌గా మారాడు. ఫోన్ ఎత్తలేదు.. అంతలోనే పోలీసులు వచ్చి!ఈ విషాదాన్ని తట్టుకోలేక రమణ్‌దీప్ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. "ఆ వార్త వినగానే నా ప్రపంచం బద్దలైపోయింది. నా జీవితం ఇక శూన్యం అనిపించింది. ఆయన నాపై చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మరువలేను" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఏడాదిన్నర వయసున్న ఆ చిన్నారి తండ్రి నవ్వునే పోలి ఉందని.. నిరంతరం తండ్రి ఎక్కడంటూ వెతుకుతోందని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఆదుకుంటున్న దాతలు.. న్యూజీలాండ్‌లోని వివిధ నగరాల నుంచి వందలాది మంది ప్రవాస భారతీయులు తరలివచ్చి బుధవారం జరిగిన రమణ్‌దీప్ అంత్యక్రియలలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయిన ఆ తల్లిని, చిన్నారిని ఆదుకునేందుకు స్థానికంగా ‘గివాలీటిల్’ అనే క్రౌడ్ ఫండింగ్ పేజీని ఏర్పాటు చేశారు. రమణ్‌దీప్ అంత్యక్రియల ఖర్చులు, ఇంటి అద్దె, ఆ కుటుంబ దైనందిన అవసరాల కోసం ఇప్పటి వరకు దాదాపు 33,000 డాలర్ల (సుమారు రూ.27 లక్షలకు పైగా) విరాళాలు సేకరించడం విశేషం.