రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనేక సరికొత్త ఆలోచనలు చేస్తోంది. సుదీర్ఘ తీర ప్రాంతం, చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఏపీలో ఉన్నాయి. ఇక విశాఖ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆధ్యాత్మికం మొదలుకొని చారిత్రక, వారసత్వ సంపద వరకూ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలకు విశాఖ ఆలవాలం. అలాంటి విశాఖపట్నంలో టూరిజాన్ని మరింత విస్తృత పరిచేందుకు ఏపీ టూరిజం సరికొత్త ఆలోచనలు చేస్తోంంది. అందులో భాగంగా ర్యాపిడో సంస్థతో ఏపీ పర్యాటక శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందం ప్రకారం విశాఖపట్నంలోని .. ఇకపై ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చటంతో పాటుగా.. వారికి టూరిస్ట్ గైడ్‌లుగా ఉపయోగపడనున్నారు. దీని ద్వారా విశాఖ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు తప్పుతాయని.. వెళ్లాల్సిన చోటుకు సరైన సమయానికి వెళ్లటంతో పాటుగా ఆ ప్రాంత వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలు, వాటి చరిత్ర, విశేషాల గురించి ర్యాపిడో సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీంతో విశాఖ అందాలు, నేపథ్యాన్ని పర్యాటకులకు ఇబ్బంది లేకుండా వివరించగలుగుతారని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా తాజా ఒప్పందంతో ర్యాపిడో డ్రైవర్లు.. 'డ్రైవర్ కమ్ గైడ్లు'గా మారనున్నారు, ఇక ఇందుకోసం తొలివిడతలో 350 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. వీరంతా తమ శిక్షణ పూర్తి చేసుకుని ఆదివారం నుంచి ఈ కొత్త ప్రాజెక్టు కోసం రంగంలోకి దిగారు. ఈ ర్యాపిడో కమ్ టూరిస్ట్ గైడ్ ఆలోచన విశాఖపట్నంలో విజయవంతమైన నేపథ్యంలో.. భవిష్యత్తులో విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు కూడా విస్తరించాలని ఏపీ టూరిజం అథారిటీ భావిస్తోంది. డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్ ఆలోచన ద్వారా పర్యాటకులకు వినూత్న అనుభూతి కలుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఫలితంగా విశాఖలో పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.