ఐపీఎల్ 2026 ఫైనల్ పూర్తిగా వన్ సైడ్ అయింది. టాస్ ఓడిపోవడం, ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ ఓటమి మొదటి గంటలోనే డిసైడ్ అయింది. ఆర్సీబీ బ్యాటర్లను ఎదుర్కొనే క్రమంలో పవర్ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఇక మ్యాచ్ చేజారిపోయింది. టైటిల్ వరకూ చేరుకుని చివరికి విజయం సాధించలేకపోవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన బాధను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. మే 31న జరిగిన ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ట్రోఫీ అందుకుంది. ఈ మ్యాచ్‌లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన గుజరాత్ టైటాన్స్ తన రెండో టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, ఫైనల్స్ ముగిసిన రెండు రోజుల తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఎమోషనల్ పోస్టు అందర్నీ బాధపెట్టింది. "మేము గెలుపునకు చాలా దగ్గరగా వచ్చాం. కానీ ఆ గీతను అందుకోలేకపోయాము. ఈ ఓటమి నన్ను చాలా బాధపెట్టింది. నా మనస్సులో చాలా భారంగా ఉండిపోయింది. అయితే, మనం ఎంతగానో ఇష్టపడే ఈ ఆట జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఓడిపోయినా తిరిగి లేచి పోరాడటమే ముఖ్యమని ఈ ఆట నేర్పింది" అని గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అదేవిధంగా తమకు సపోర్ట్‌గా నిలిచిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. "మా విజయాలు, పరాజయాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ సపోర్టే మమ్మల్ని చివరి వరకు పోరాడేలా చేసింది. మీ అందరికీ ప్రేమతో.. ఆవా డే" అని పోస్ట్ చేశాడు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చాలా అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో అదరగొట్టాడు. 16 మ్యాచ్‌లలో 732 పరుగులు సాధించాడు. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై చేసిన 104 పరుగుల శతకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ లీగ్ స్టేజ్‌లో ఆరంభంలో పరాజయాలు ఎదుర్కన్నా ఆ తర్వాత లేచి నిలబడి 9 విజయాలతో టాప్ 2లో నిలిచింది. 2022లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఐదు సీజన్లలో నాలుగుసార్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం విశేషం.