అమల్లోకి భారత్- ఒమన్ ఒప్పందం.. హర్మూజ్‌కు ప్రత్యామ్నాయం దొరికినట్టే!

Wait 5 sec.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచిపోయి భారత్‌ ఇబ్బందికర పరిస్థితులను ఎదురోంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌-ఒమన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూన్ 1 నుంచి అమల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది డిసెంబరులో కుదిరిన ఈ ఒప్పందం వల్ల హర్మూజ్‌‌పై ఆధారపడకుండా ఇంధన దిగుమతుల కోసం భారత్‌కు ప్రత్యామ్నాయం దొరికినట్లేనని నిపుణులు భావిస్తున్నారు.గతేడాది డిసెంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒమన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులుపడ్డాయి. భారత్, ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. దీని ప్రకారం పలు దిగుమతులకు సుంకాలను మినహాయించాయి. ఇకపై భారత్‌ ఎగుమతి చేసే 99.38 శాతం ఉత్పత్తులకు ఎటువంటి సుంకం ఉండదు. ఈ జాబితాలో ఆభరణాలు, రత్నాలు, టెక్స్‌టైల్స్‌, లెదర్‌, ఫుట్‌వేర్‌, ప్లాస్టిక్స్‌, వ్యవసాయ, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, మెడిసిన్, వైద్య పరికరాలు, ఆటోమొబైల్‌ వంటివి ఈ ఉన్నాయి. సుంకాల మినహాయింపులతో భారతీయ ఉత్పత్తులకు ఒమన్‌లో మార్కెట్‌ విస్తరించనుంది. అలాగే, ఆ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో 78శాతం వస్తువులకు సుంకాలను మినహాయించారు.ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో నౌకల రవాణాకు అంతరాయం ఏర్పడింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. హర్మూజ్‌లో అమెరికా, ఇరాన్ సైన్యాల మధ్య ఘర్షణ మాత్రం కొనసాగుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో హర్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా గల్ఫ్‌ దేశాల నుంచి భారత్ చమురు దిగుమతులు పెంచుకునే అవకాశాలు లభించినట్టయ్యింది. ఒమన్‌ తీరంలో అధిక భాగం గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రానికి ఆనుకుని హర్మూజ్ జలసంధికి వెలుపలే ఉంటుంది. కాబట్టి హర్మూజ్‌లో రవాణాకు అంతరాయం ఏర్పడిన సమయల్లో సలాలా, దుఖ్మ్‌ వంటి పోర్టుల ద్వారా భారత్‌ చమురు దిగుమతి చేసుకునే వీలుంటుందని గ్లోబల్‌ ట్రేడ్ రిసెర్చ్‌ ఇనిషియేటివ్‌ ఫౌండర్ అజయ్‌ శ్రీవాస్తవ్‌ పేర్కొంది. ఇప్పటికే ఈ నౌకాశ్రయాల నుంచి చమురు దిగుమతులను భారత్‌ పెంచింది. ఏప్రిల్‌ 2025లో గల్ఫ్ దేశాల నుంచి 15 బిలియన్‌ డాలర్ల మేర విలువైన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంది. కానీ, అమెరికా ఇరాన్ యుద్ధంతో ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో వాటి సంఖ్య 9.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో ఒమన్‌ నుంచి భారత్ దిగుమతులు ఏకంగా 246.4 శాతం మేర పెరిగి 1.5 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం విశేషం. వీటిలో క్రూడాయిల్, ఎరువులే అత్యధికం కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో (2025-26 ) ఒమన్ నుంచి భారత్‌ 7.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. వీటిలో చమురు 1.6 బిలియన్‌ డాలర్లు కాగా.. ఎల్ఎన్‌జీ 1.2 బిలియన్‌ డాలర్లు. అలాగే, ఆ దేశానికి భారత్ ఎగుమతుల విలువ 3.64 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వీటిలో శుద్దిచేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, స్టీల్‌, బియ్యం వంటివి ఎక్కువగా ఉన్నాయి.