ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్.. నెల రోజులే గడువు, త్వరపడండి

Wait 5 sec.

రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు చలాన్‌లు విధించి.. వారిపై కొరఢా ఝళిపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాహనదారులపై అనేక ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నా.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు దొరికినప్పుడు వారి బండి నంబర్ ఆధారంగా చెక్ చేస్తే.. వేలల్లో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది పోలీసులకు చిక్కకుండా.. ట్రాఫిక్ చలాన్లను కట్టకుండా.. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తూ.. ఫైన్లు కొండలా పేరుకుపోయే వరకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇక నుంచి ట్రాఫిక్ చలాన్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పక్కాగా ఓనర్లకు చేరేలా తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు పొందేందుకు ప్రతీ ఒక్కరూ తమ వివరాలను వెంటనే వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతీ ఒక్క వాహనదారుడు తమ మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయిన వాహన్ () లో తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఇక ప్రభుత్వం ఇచ్చిన నెల రోజుల గడువు ముగిసిన తర్వాత.. వాహన్ పోర్టల్‌లో నమోదై ఉన్న సెల్ నంబరు, ఈ-మెయిల్‌కు ఎస్ఎంఎస్, వాట్సాప్, మెయిల్ ద్వారా ట్రాఫిక్ చలాన్లను సంబంధిత వాహన యజమానికి పంపిస్తారు. ఇలా పంపిన ట్రాఫిక్ చలాన్లు.. వారికి అందినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకుముందు లాగా.. తమ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ రాలేదని.. దానికి సంబంధించి మెసేజ్ కూడా రాలేదని.. అసలు తమ బండిపై ట్రాఫిక్ చలాన్ ఉందనే సమాచారం కూడా తమకు తెలియదని వాహనదారులు చలాన్లు తప్పించుకోవడానికి వీలు ఉండదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇలాంటి సాకులు చెప్పి.. కొందరు వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా తప్పించుకునే వారని తెలిపాయి. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల వసూళ్లను మరింత వేగంగా వసూలు చేయడానికి.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో మరింత పారదర్శకతను పెంచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.