క్రికెట్ చరిత్రలో తొలిసారిగా అప్ఘనిస్థాన్‌ జట్టు భారత్‌ను హోస్ట్ చేయబోతోంది. సాధారణంగా హోస్ట్ చేసే జట్టు తమ సొంత దేశం వేదికగానే మ్యాచ్‌లు ఆడుతుంది. కానీ ఈ సిరీస్ అప్ఘనిస్థాన్‌లో కాకుండా భారత రాజధాని ఢిల్లీలో జరగనుంది. సెప్టెంబర్‌లో ఈ సిరీస్ జరగనున్నట్లు సమాచారం. అప్ఘనిస్థాన్ నేషనల్ క్రికెట్ టీమ్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను భారత్‌లోనే ఆతిథ్యం ఇవ్వనుందనమాట. ఈ మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం పూర్తిగా వెలువడలేదు. ప్రస్తుతం అప్ఘనిస్థాన్ జట్టు జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఇదే సమయంలో భవిష్యత్‌లో రిటర్న్ టూర్ నిర్వహించాలని అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐను సంప్రదించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. బీసీసీఐ - అప్ఘనిస్థాన్ బోర్డు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే దేశాల క్రికెట్ బోర్డులకు ఆర్థికంగా సహకారం అందించేందుకు టీమిండియా అక్కడ పర్యటించాయి. ఇదే తరహాలో అప్ఘనిస్థాన్‌ను కూడా ప్రోత్సహించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అప్ఘనిస్థాన్‌లో పరిస్థితుల కారణంగా ఆ దేశ జట్టు గత దశాబ్ద కాలంగా భారత్, యూఏఈ వేదికలపై తమ హోమ్ మ్యాచ్‌లు ఆడుతోంది. 2017లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో, 2018లో డెహ్రాడూన్‌లో బంగ్లాదేశ్‌తో అప్ఘనిస్థాన్ సిరీస్‌లు ఆడింది. ఆ తర్వాత యూఏఈని తమ ప్రధాన హోమ్ వేదికగా ఉపయోగించుకుని అక్కడి నుంచే ఎక్కువ సిరీస్‌లు ఆడింది. 2024లో న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం తగ్గినప్పటికీ మైదానం సరిగా లేకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఆ టెస్టు రద్దయింది. దాంతో అప్ఘనిస్థాన్ తమ హోమ్ సిరీస్‌లను షార్జాలో నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ తిరిగి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అప్ఘన్ తమ హోమ్ సిరీస్ భారత్ వేదికగా టీమిండియాతోనే ఆడనుండటం విశేషం.