కాళ్లూచేతులూ నరికేసే శిక్షలు విధిస్తేనే జనం చట్టాలను పాటిస్తారు.. కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

చట్టాలంటే జనాలకు భయం లేకుండా పోయిందని, కఠిన శిక్షలు వేయకపోవడం వల్లే ప్రజలు అలవాటుగా మార్చుకుని రోజువారీ నేరాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కేసులో నిందితుడు (గోపి రెడ్డి కార్తీక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ కోర్టు పై విధంగా స్పందించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు లభించిన హక్కులను ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారని జస్టిస్ ఆర్. నటరాజ్ అభిప్రాయపడ్డారు. ‘‘బహుశా అరబ్ దేశాల తరహాలో తప్పు చేసిన వారి కాళ్లు, చేతులు నరికేసే కఠినమైన శిక్షలు ఉంటేనే, ఇక్కడి ప్రజలు చట్టాలను గౌరవిస్తారేమో’’ అని ఆయన వ్యాఖ్యానించారు.‘‘నేరస్థులను కఠినంగా శిక్షించకపోవడం వల్లే చట్టం తన పదునైన కోరలను కోల్పోయింది.. అందుకే పశ్చిమాసియా దేశాలు (అరబ్ దేశాలు) మాదిరిగా కాకుండా ఇక్కడ నేరం చేయడం చాలా సులభం అయిపోయింది.. కాలో లేదా చెయ్యో నరికేస్తేనే బహుశా అప్పుడు చట్టాన్ని పాటించాలనే నిజాన్ని ప్రజలు గ్రహిస్తారు.. మనది ప్రజాస్వామ్యం కావడం వల్ల, ప్రతి ఒక్కరూ దీనిని చాలా తేలికగా తీసుకుంటున్నారు’’ అని జస్టిస్ నటరాజ్ అన్నారు.మణిపాల్ ఎంఐటీ (MIT) విద్యార్థి గోపిరెడ్డి కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం ఆరోపణలపై అతను ఏప్రిల్ 5 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ‘‘ఉప్పు తిన్నప్పుడు నీళ్లు తాగక తప్పదు. మరో నాలుగు ఐదు రోజులు అతడ్ని జైల్లోనే ఉండనివ్వండి. అక్కడి వాతావరణానికి అలవాటు పడనివ్వండి.. ఒకవేళ శిక్ష పడితే మళ్లీ జైలుకే వెళ్లాల్సి వస్తుందని అతడికి తెలుస్తుంది’ అని పేర్కొంటూ నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అనంతరం ఈ బెయిల్ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.నిందితుడి తరపున హాజరైన లాయర్ అయంతికా మోండల్ వాదనలు వినిపిస్తూ.. గత రెండు నెలలుగా తన క్లయింట్ జైల్లో ఉన్నాడని, ఎలాంటి నేరానికి పాల్పడలేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు దాదాపు మూడేళ్ల కిందట జరిగాయని చెబుతున్న ఘటనకు సంబంధించినవని, తనను ఇలాగే జైల్లో ఉంచితే వృత్తిపరమైన భవిష్యత్తు దెబ్బతింటుందని కోర్టుకు విన్నవించారు.బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. నిందితుడు ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో మొదట్లో తాను కూడా నమ్మానని, కానీ, అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో దూరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, 2023 సెప్టెంబర్ 12న తమ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడాలంటూ ఒప్పించి తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది.ఈ ఘటనతో తీవ్ర మానసిక క్షోభ, కుంగుబాటుకు గురయ్యానని, ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించి, అనంతరం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఉడుపి మహిళా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.