ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త.. రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎస్ సాయిప్రసాద్ అమరావతిలోని సచివాలయంలో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పోస్టుల భర్తీ, స్థానిక క్యాడర్ ఆర్గనైజేషన్‌కు అనుగుణంగా ప్రకటన, కొత్త లోకల్ క్యాడర్లలో పోస్టుల కేటాయింపునకు సంబంధించిన నోటిఫికేషన్, రిజర్వేషన్ రోస్టర్, ఏపీపీఎస్సీ, ఇతర నియోజక ఏజెన్సీలకు ఖాళీల వివరాలపై సమీక్ష చేశారు. ఈ మేరకు అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. అంతేకాదు ఉద్యోగులకు సంబంధించి బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అంశాల్లో స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని సీఎస్ సూచించారు. ఆరు నెలల్లో క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన పెండింగ్‌ కేసులను పరిష్కరించాలన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ఇప్పటికే తొలి దశ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చిలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి రాష్ట్రంలోని పలు యూనివర్శటీలలో పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.. దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌లోని మిగతా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు షెడ్యూల్స్‌ ప్రకారం విడుదల కానున్నాయి. జాబ్ క్యాలెండర్‌ రెండో విడత నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఆగస్టు 15న జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో జాబ్ క్యాలెండర్‌లో 3,168 పోస్టులు ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ముందు 3,979 పోస్టులతో రెండో జాబ్ క్యాలెండర్ జారీ చేయాలని భావించారు.. కానీ 3,168 పోస్టులకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. వీటిలో 91 గ్రూప్‌-1 పోస్టులు ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే రెండో విడత ఉద్యోగ నియామాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌పై క్లారిటీ వస్తుందంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో 10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగను ప్రకటించారు.. వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను మంత్రి లోకేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఏటా ఉగాదికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని లోకేష్ ప్రకటించారు.