3 వారాల్లో వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

Wait 5 sec.

తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు వేగవంతం చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి.. భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని పెంచడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఈ 2 విమానాశ్రయాలు కీలకంగా మారనున్నాయని సీఎం పేర్కొన్నారు.ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణలో తెలంగాణ సర్కార్ చొరవ చూపిందని తెలిపారు. మరో 3 వారాల్లో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2వ తేదీ నాటికి వరంగల్ ఎయిర్‌పోర్టును పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని.. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. విషయానికి వస్తే.. అక్కడ రక్షణ శాఖకు చెందిన భూముల అంశం పరిష్కారమైన వెంటనే భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణలో మరిన్ని ఎయిర్‌పోర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని.. ప్రాంతీయ కనెక్టివిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ.. జీడీపీలో దాదాపు 5 శాతం వాటా కలిగి ఉండటం తెలంగాణ ఆర్థిక బలాన్ని సూచిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే తెలంగాణలో ప్రపంచ స్థాయి విమానాశ్రయాల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. ఇక వరంగల్ ఎయిర్‌పోర్టు రూపకల్పనలో కాకతీయుల వైభవం, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్టులను నిర్మించడం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సీఎం వెల్లడించారు.