వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకుపై కన్న తల్లే దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడు చెప్పటంతో.. నవ మోసాలు కనిపెంచిన విషయాన్ని మరిచిన ఆ మహిళ.. ఏడేళ్ల కొడుకుపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవటంతో తల్లీ,కొడుకు కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజు అనే వ్యక్తితో మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది.దీంతో అతను మహిళ ఇంటికి తరుచూ వచ్చేవాడు. ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు. అయితే మహిళకు ఉన్న ఏడేళ్ల కొడుకుతో అతనికి ఇబ్బంది కరంగా అనిపించింది. తమ ఏకాంతానికి బాలుడి వలన ఆటంకం కలుగుతోందని భావించాడు. ఇదే విషయాన్ని మహిళకు చెప్పాడు. ఏడేళ్ల బాలుడిని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తే ఇద్దరం ఇబ్బంది లేకుండా ఉండొచ్చని మాట్లాడుకున్నారు. దీంతో బాలుడిని చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున మహిళ, ఆమె ప్రియుడు కలిసి బాలుడిపై దాడి చేశారు. బ్లేడ్‌తో బాలుడి శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు గాయపరిచారు. ఎంతటి నీచంగా ప్రవర్తించారంటే చివరకు బాలుడి ప్రైవేట్ పార్ట్ మీద కూడా బ్లేడుతో గాయం చేశారు.వీరి వేధింపులను తట్టుకోలేని బాలుడు గట్టిగా కేకలు వేయడంతో.. ఇరుగుపొరుగు జనం అక్కడకు చేరుకున్నారు. రక్తగాయాలతో చిన్నారి కనిపించటంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాలుణ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ప్రియుడి మోజులో చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే ప్రియుడి మోజులో పడి తల్లిననే సంగతి మరిచి కుమారుడిపైనే దాడి చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.