కేంద్రం అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్‌లను ఆధునిక హంగులతో అభివృద్ధి చేస్తోంది. తెలంగాణలో కూడా అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్‌లలో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు.. ఇప్పటికే కొన్ని రైల్వే స్టేషన్‌లలో పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోనూ హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ హైటెక్ హంగులతో ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 17న హైటెక్ సిటీతో పాటుగా మరికొన్ని రైల్వే స్టేషన్‌లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆ రోజు దేశవ్యాప్తంగా అమృత్‌ భారత్‌ పథకం కింద రీ డెవలప్‌మెంట్‌ చేసిన మొత్తం 75 రైల్వేస్టేషన్లను ప్రధాని ఒకేసారి వర్చువల్‌ పద్ధతిలో జాతికి అంకితం చేస్తారు. ఈ నెల 17న జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌‌తో పాటూ పలువురికి దక్షిణ మధ్య రైల్వే నుంచి ఆహ్వానం అందించారు. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ను మొత్తం రూ.26 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేశారు. ఈ రైల్వే స్టేషన్ హైటెక్‌సిటీతో పాటు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఐడీ కారిడార్‌కు దగ్గరగా ఉంది. దీంతో ప్రతి రోజూ వేలాదిమంది ఉద్యోగులు, ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకల కొనసాగిస్తుండటంతో కీలకంగా మారింది. ప్రతి రోజూ ఏకంగా 62 ఎంఎంటీఎస్, సబర్బన్‌ రైళ్లు ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి వెళుతుంటాయి. కేంద్రం అమృత్ భారత్ పథకం కింద నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే స్టేషన్‌లో ఉన్న రెండు లిఫ్టులకు అదనంగా మరో రెండు లిఫ్టులు, ప్రధాన ప్రవేశద్వారం అభివృద్ధి, కొత్త ఓవర్‌ బ్రిడ్జి, వెయిటింగ్‌హాల్, కొత్తగా టాయిలెట్లు, కొత్త స్టేషన్‌ భవనం నిర్మించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైనా ఆధునిక సౌకర్యాలు కల్పించారు. మొత్తం పనులు పూర్తి కావడంతో ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైటెక్‌సిటీ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. మొత్తం మీద ఆధునకి హంగులతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభంకాబోతోంది.