Bonus Shares: భారత స్టాక్ మార్కెట్లు మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో కొనుగోళ్ల వెల్లువ కొనసాగుతోంది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో జులై 6న ఉదయం 10.30 గంటలకు సెన్సెక్స్ 430 పాయింట్ల లాభంతో 78200 స్థాయిలో ఉంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 130 పాయింట్లు పుంజుకొని 24400 స్థాయిలో ఉంది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం ఇలా పలు హెవీ వెయిట్ స్టాక్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు బీఎస్ఈ, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పేటీఎం, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నష్టాల్లో ఉన్నాయి. ఇక్కడ మనం వీ మార్క్ ఇండియా లిమిటెడ్ స్టాక్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్ సోమవారం సెషన్‌లో తీవ్ర ఒడుదొడుకుల నడుమ ట్రేడవుతోంది. సెషన్ ఆరంభంలో 3 శాతానికిపైగా పెరిగి రూ. 1599 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 1576 వద్ద ఉంది. ఇక్కడ స్టాక్ పుంజుకునేందుకు ఒక కారణం ఉంది. కంపెనీ ఇటీవల బోనస్ ఇష్యూ ప్రకటించగా దానికి రికార్డ్ డేట్ దగ్గరపడుతుండటం. వైర్స్ అండ్ కేబుల్ మేకర్ వీ మార్క్ ఇండియా ఇటీవల 5:1 రేషియోలో బోనస్ ఇష్యూ ప్రకటించింది. దీనికి రికార్డ్ డేట్ జులై 7 గా నిర్ణయించింది. ఈ ఆశిష్ కచోలియా మద్దతు ఉన్న స్టాక్‌లో బోనస్ షేర్లు దక్కించుకునేందుకు సాంకేతికంగా ఈ ఒక్కరోజే (జులై 6) ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సెబీ T+1 సెటిల్మెంట్ నిబంధనల ప్రకారం రికార్డ్ డేట్ కంటే ఒకరోజు ముందుగా షేర్లను కొనుగోలు చేస్తేనే కార్పొరేట్ యాక్షన్‌కు తగ్గట్లుగా డీమ్యాట్ అకౌంట్లలో ఆ రోజుకు ఆ షేర్లు కనిపిస్తాయి. 5:1 బోనస్ ఇష్యూ అంటే ఇక్కడ ఒక్కో ఈక్విటీ షేరుపై అదనంగా 5 షేర్లు వస్తాయి. అంటే మొత్తం షేర్ల సంఖ్య 6 అవుతుంది. అలాగే 100 షేర్లు కొంటే 600 షేర్లు వస్తాయన్నమాట. ఇప్పటికే ఈ కంపెనీలో షేర్లు ఉన్నవారికి, అదే విధంగా ఈ రోజు లోపు కొనే వారికి ఈ బోనస్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ బోనస్ ఇష్యూకు అనుగుణంగా షేర్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి షేర్ ధర సర్దుబాటు అవుతుందని గమనించాలి. కానీ షేరు ధర తగ్గడంతో కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా బోనస్ ఇష్యూ వల్ల ఇన్వెస్టర్లకు నమ్మకం కలుగుతుందని చెబుతుంటారు. అలా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటుంటారు. మూడేళ్లలో బంపర్ రిటర్న్స్ఈ స్టాక్ గత కొంత కాలంగా కూడా మంచి రిటర్న్స్ అందించింది. నెలలో 8 శాతం పెరగ్గా, 3 నెలల్లో 150 శాతం వరకు పుంజుకుంది. ఏడాదిలో 250 శాతానికిపైగా రిటర్న్స్ అందించింది. ఇక మూడేళ్లలో ఏకంగా 1850 శాతానికిపైగా షేర్ ధర పెరగ్గా ఇక్కడ లక్ష పెట్టుబడిని రూ. 19 లక్షలు చేసిందని చెప్పొచ్చు. ఐదేళ్ల కాలంలో 4700 శాతానికిపైగా పుంజుకుంది. ఇక్కడ లక్ష పెట్టుబడిపై రూ. 48 లక్షలు వచ్చాయి.