తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ జూలై 10న కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఇదే కరూర్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. గతేడాది జరిగిన ఈ పర్యటనలో భారీ తొక్కిసలాట జరిగి ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత విజయ్ ఈ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. కరూర్ పర్యటనలో భాగంగా విజయ్ ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు బాధిత కుటుంబాలను ఓదార్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ప్రజా సమావేశాల్లోనూ పాల్గొననున్నట్లు టీవీకే నేత ఎం.ఆర్. విజయ్ భాస్కర్ వెల్లడించారు. గతేడాది కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత సీఎం విజయ్ చేపడుతున్న తొలి పర్యాటన కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది సెప్టెంబర్ 25న కరూర్‌లో విజయ్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఊహించిన దాని కంటే వేలాదిగా అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. విజయ్‌ను చూడాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడటం, సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కరూర్‌కు రావడం ఇదే తొలిసారి. జూలై 10న కరూర్‌లోని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే విజయ్, ప్రజలతో నేరుగా మమేకమయ్యే మక్కల్ సందిప్పు అనే కార్యక్రమంలో కూడా పాల్గొంటారని టీవీకే నేత విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, కార్యక్రమాల వివరాలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత డీఎంకే, టీవీకే మధ్య తీవ్ర విమర్శలు కొనసాగాయి. ఈ కేసు చివరికి సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. 2025 అక్టోబర్ 13న సుప్రీంకోర్టు ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు బదిలీ చేసింది. ఈ కేసులో తమను కూడా చేర్చాలంటూ డీఎంకే జూలై 4న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, అలాగే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు చేసిన వ్యాఖ్యలు సీబీఐ దర్యాప్తు స్వతంత్రతను ప్రభావితం చేసే అవకాశం ఉందని డీఎంకే తన పిటిషన్‌లో పేర్కొంది.