దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత.. ముద్దుబిడ్డను కోల్పోయిన సినీ కళామతల్లి

Wait 5 sec.

భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణాది సినిమాకు పల్లెటూరి పచ్చదనాన్ని, సహజత్వాన్ని పరిచయం చేసిన అరుదైన దర్శకుడు ‘ఇయక్కునర్‌ ఇమయమ్‌’ (దర్శక శిఖరం) భారతీరాజా (85) ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు గోడల స్టూడియో సెట్లలో బందీగా ఉన్న సినిమాను, నిజమైన మనుషుల మధ్యకు, గ్రామీణ వాతావరణంలోకి నడిపించిన ఈ మహోన్నత దర్శకుడి మరణవార్త యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, లక్షలాది మంది అభిమానులు తరలివస్తున్నారు. అలాగే ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సెలబ్రెటీలు సోషల్‌మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.పుత్రశోకంతో దిగాలు సినీ తెరపై ఎన్నో భావోద్వేగాలను పండించిన ఈ లెజెండరీ దర్శకుడి వ్యక్తిగత జీవితంలో గతేడాది కోలుకోలేని పెద్ద విషాదం చోటుచేసుకుంది. 2025 మార్చిలో ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా కేవలం 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అకాల మరణం చెందారు. తన కళ్ల ముందే కొడుకు వెళ్లిపోవడంతో భారతీరాజా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ పుత్రశోకం ఆయన్ని మానసికంగా బాగా కుంగదీసింది. కొడుకు అంత్యక్రియల సమయంలో ఆయన పడిన వేదన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఆ మానసిక వేదన కారణంగానే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. గతేడాది డిసెంబర్‌లో శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం తీవ్రమవడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వయసు పైబడటం, మానసిక దిగులు తోడవడంతో అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేకపోయారు. వెండితెరపై ప్రభంజనంభారతీరాజా అనగానే మనకు గుర్తొచ్చేది వాస్తవికత. 1977లో తమిళంలో '16 వయాతినిలే' చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన, అదే సినిమాను తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ (శ్రీదేవి, చంద్రమోహన్)గా రీమేక్ చేసి ఇక్కడా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన అందించిన ‘సీతాకోకచిలుక’ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి ఎందరో నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. కేవలం మెగాఫోన్ పట్టడమే కాదు.. నటుడిగానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. త్వరలో విడుదల కానున్న ‘పులవర్’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. నటుడిగా ఇదే ఆయన చివరి చిత్రం కానుంది. వీల్ చైర్‌లో గురువు... రాధిక కన్నీళ్లుభారతీరాజా మరణానికి కొన్ని రోజుల ముందు సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఆయన్ని స్వయంగా కలిసి పరామర్శించారు. 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన 'కిజక్కే పోగుమ్ రైల్' చిత్రంతోనే రాధిక సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ రకంగా ఆయన ఆమెకు ఆరాధ్య గురువు. అయితే ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే తన గురువును అనారోగ్య కారణాల వల్ల వీల్ చైర్‌కే పరిమితమై, చాలా బలహీనంగా ఉన్న స్థితిలో చూడగానే రాధిక తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యాలు చూసి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు సైతం షాక్‌కు గురయ్యారు. ఆ స్థితిలోనూ సినిమాపై ఉన్న ప్రేమతో రాధిక నటిస్తున్న తాజా చిత్రం 'తాయ్ కిళవి' గురించి భారతీరాజా ప్రత్యేకంగా మాట్లాడారు. అందులో రాధిక నటనను అభినందిస్తూ, ఆమెకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని ఆశీర్వదించారు. తన గురువు ఇచ్చిన ఆశీస్సులు ప్రపంచంలోని ఏ అవార్డు కన్నా గొప్పవని రాధిక అప్పట్లో సోషల్‌మీడియా ద్వార ఎమోషనల్‌గా పంచుకున్నారు. ఆ కలయికే గురుశిష్యుల చివరి కలయిక అవుతుందని ఎవరూ ఊహించలేదు. సహజత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచి, భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ ‘దర్శక శిఖరం’ భౌతికంగా మనకు దూరమైనా.. ఆయన సృష్టించిన అద్భుత కావ్యాలు, మరపురాని పాత్రల రూపంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.