ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లొచ్చాక, అస్సలు ఊహించలేదు!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు భారీగా నిధులు కేటాయించింది. 16వఆర్థిక సంఘం నిధులు ఏకంగా రూ.16,627 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో బేసిక్ గ్రాంట్ రూ.13,302 కోట్లు కాగా.. పెర్‌ఫార్మెన్స్‌ గ్రాంట్‌ రూ.3,225 కోట్లు ఉన్నాయి. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేయనుంది. గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,800 కోట్లు కేటాయించారు. తాజాగా16వ ఆర్థిక సంఘంలో అదనంగా రూ.3,827 కోట్లు కేటాయించింది.కేంద్రం కేటాయించిన బేసిక్‌ గ్రాంట్‌ను టైడ్, అన్‌టైడ్‌ కేటగిరీలుగా విభజించింది. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పలు కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. టైడ్‌ నిధుల నుంచి 50% గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సూచించింది. 10శాతం అన్‌టైడ్‌ నిధుల నుంచి రోడ్ల పనులకు ఖర్చు చేయాలని తెలిపింది. మిగిలిన నిధుల్ని ఇతర అవసరాలకు కేటాయించాలని సూచించింది. ఈ నిధుల్ని సిబ్బంది జీతాలు, కార్యాలయాల నిర్వహణకు వినియోగించకూడదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల చేసిన ఈ నిధుల్ని గ్రామ పంచాయతీలకు 70%, జిల్లా పరిషత్‌లకు 15%, మండల పరిషత్‌లకు మిగిలిన 15% కేటాయించాలన్నారు.అంతేకాదు రాష్ట్రానికి ఈ నిధుల విడుదలకు సంబంధించి పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు ఎన్నికల నిర్వహించాలనే షరతుతో పాటు మరికొన్ని ఉన్నాయి. పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు సంబంధించిన ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాలు అందుబాటులో ఉండాలి. ఈ-గ్రామ్‌స్వరాజ్‌ పోర్టల్‌లో గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికలు అప్‌లోడ్‌ చేయాలి.. నిధుల వ్యయం వివరాలు కూడా నమోదు చేయాలి. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు చేసి.. కార్యకలాపాలు, సిఫార్సుల నివేదికను అసెంబ్లీకి సమర్పించాలని షరతు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన మరుసటి రోజు ఈ నిధులు కేటాయించారు. అంతేకాదు ఏపీకి వీబీ జీ రామ్‌జీ పథకం కింద కేంద్రం రూ.7,700 కోట్లకు పైగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.