కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు .. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. సినీ హీరో, జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్లు పెద్ద దుమారం రేపుతున్నాయి. జన సైనికులకు, మెగా అభిమానులు రాహుల్ రామకృష్ణను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయినా వెనక్కి తగ్గని రాహుల్.. ప్రశ్నించినందుకు తానేమీ దేశ ద్రోహిని అయిపోనని గట్టిగా బదులిచ్చాడు. అసలేం జరిగిందంటే..''మన నాయకుడు మాటే అంతిమం. ఆయన మార్గంలో ఉన్న దుష్టశక్తులను ఎవరూ చూడలేదు. త‌ప్పొప్పుల గురించి ఆయనకు బాగా తెలుసు. మీ సందేహాల్ని ప‌క్క‌న పెట్టి, నోరు మూసుకొని, ఎటువంటి ప్ర‌శ్న‌లు వేయ‌కుండా నాయ‌కుడిని అనుసరించండి. పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు'' అని మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై ఇప్పటికే ప్రకాష్ రాజ్, రామ్ గోపాల్ వర్మ లాంటి సినీ ప్రముఖులు స్పందించగా.. రాహుల్ రామకృష్ణ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. నాగబాబు ట్వీట్ పై స్పందిస్తూ ''ఒప్పో'' అని కామెంట్ పెట్టారు. అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాన్ కు పలు ప్రశ్నలు సంధించారు. ''పవన్ కళ్యాణ్.. దయచేసి PESA, 1/70 చట్టం, గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను అడిగి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు, మీరు చేశారా? ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించిన ప్రకారం సంఖ్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి, గుర్తించిన ఫలితాలను అడుగుతున్నాను. జై తెలంగాణ'' అని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మరో పోస్ట్ పెడుతూ.. ''మీ మామూలు ఆర్భాటాలు, గొప్పలు చెప్పుకోవడం పక్కన పెడితే, మీరు నిర్వహించే ప్రతి పదవిలోని ప్రతి విభాగంలో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4.1(బి) ప్రకారం ముందస్తు సమాచార వెల్లడిని అమలు చేశారా సార్?. నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను, మీరు మా ప్రశ్నలకు నిరంతరం సమాధానం ఇవ్వాలి'' అని రాహుల్ రామకృష్ణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. రాహుల్ రామకృష్ణపై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరో ట్వీట్ పెట్టారు. ''ప్రశ్నించినందుకు నేనేమీ దేశద్రోహిని అయిపోను'' అని పేర్కొన్నారు. ఏదేమైనా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన తెలంగాణను ఉద్దేశించి మాట్లాడారో కానీ.. అది కాస్తా నిప్పురవ్వలా అంటుకుంది. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలంగాణ నాయకులు, అధికార ప్రతిపక్షాలు పవన్ పై మండిపడుతున్నారు. ఇది చాలదన్నట్టు 'ప్రశ్నించడం మానేసి పవన్ కళ్యాణ్ ను ఫాలో అవ్వాలంటూ' నాగబాబు చేసిన ట్వీట్ ఆయనపై మరిన్ని విమర్శలకు కారణమైంది. రాజకీయాల్లో ఉన్నవారిని ప్రశ్నించి తీరుతాం అంటూ ప్రకాష్ రాజ్, రాహుల్ రామకృష్ణ లాంటి సినీ నటులు పోస్టులు పెడుతున్నారు.