పిల్లలు పుట్టిన వెంటనే వాళ్లల్లో అన్ని మార్పులు కనుక్కోవడం కాస్త కష్టమే.. కాకపోతే ఇక్కడ కనీసం పుట్టింది ఆడపిల్లా? మగబిడ్డా? అని ఆ డాక్టర్లు కూడా చెప్పకపోవడమే కాస్త విచిత్రం. ఇది డాక్టర్ల నిర్లక్ష్యమే అంటూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రోడ్డెక్కగా.. డాక్టర్లు మాత్రం తమ తప్పేమీ లేదని చెబుతున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా మండలానికి చెందిన ఓ గర్భిణి మే 3న గుంతకల్లులో ఉన్న ఓ నర్సింగ్ హోమ్‌కు వెళ్లింది. నెలలు నిండే సమయం కావడంతో సాధారణ పరీక్షల నిమిత్తం వారు ఆ నర్సింగ్ హోమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో తల్లికి బీపీ ఎక్కువగా ఉందని, ఇలానే ఉంటే చాలా ప్రమాదమని, త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దాంతో ప్రాణం మీదకు రావడంతో ఎనిమిదో నెలలోనే గర్భిణికి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. సిజేరియన్ తర్వాత తమకు ఆడబిడ్డ పుట్టిందని వైద్యులు చెప్పడంతో, కుటుంబసభ్యులు కూడా ఆడపిల్ల పుట్టిందని అందరికీ చెప్పుకొన్నారు. అయితే, పూర్తిగా నెలలు నిండకపోవడంతో బిడ్డకు అనారోగ్య సమస్యలు రావడంతో గుంతకల్లులోని ఓ ప్రైవేట్ చిల్డ్రన్ ఆస్పత్రి ఐసీయూలో కొన్ని రోజులు ఉంచారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ వైద్యులు కుటుంబసభ్యులకు సూచించారు. దాంతో వాళ్లు బిడ్డను వెంటనే కర్నూలుకు తీసుకెళ్లారు. కర్నూలు ఆస్పత్రిలో బిడ్డకు స్కానింగ్‌లు నిర్వహించడంతో ఆ శిశువు మగబిడ్డ అని తేలింది. అదేంటి ఇన్నాళ్ల పాటు ఆడపిల్ల అనుకుంటే ఇప్పుడు మగబిడ్డ అన్నారని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు కూడా ఏం అర్థం కాలేదు. అయితే.. బిడ్డకు జననాంగం వృద్ధి చెందకపోవడంతోనే ఈ కన్ఫ్యూజన్ ఏర్పడిందని, ఆడపిల్ల కాదని మగబిడ్డ అంటూ కర్నూలులోని వైద్యులు తేల్చారు. గుంతకల్లులోని వైద్యులు తమకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఈ బిడ్డ కుటుంబసభ్యులు స్థానిక కమ్యూనిస్టు నాయకులతో కలిసి నర్సింగ్ హోమ్ ఎదురు నిరసనకు దిగారు. దీనిపై స్పందించిన నర్సింగ్ హోమ్ వైద్యులు.. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని, కన్జెనిటల్ అడ్రినల్ హైపర్ ప్లాసియా కారణంగా పుట్టకతో లక్షల్లో ఒకరికి మాత్రమే జననాంగం వృద్ధి చెందకపోవడం వంటి సమస్యలు వస్తాయని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మేనరిక వివాహం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని.. ఇక్కడ కూడా వాళ్లది మేనరిక వివాహం కావడంతోనే ఇలా జననాంగం వృద్ధి చెందలేదని వైద్యులు తేల్చి చెప్పారు. డాక్టర్ల వాదన ఇలా ఉంటే.. కుటుంబసభ్యులు ఈ విషయాన్ని తమకు ముందే చెప్పాలి కదా అని నిలదీశారు. వివాదం ముదరడంతో పోలీసుల ఎంట్రీ ఇచ్చి సమస్యను సర్దుమణిగించారు.