విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో తల్లీకొడుకు మృతదేహాలు లభ్యం కావటం కలకలం రేపుతోంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ 98వ వార్డు అయిన అడివివరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే పోస్టాఫీసు వీధిలోని ఒక లాడ్జిలో తల్లీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఎందుకు వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారనేదీ చర్చనీయాంశంగా మారింది. వెల్లడించిన వివరాల ప్రకారం.. పాగ గాజువాక దరి శ్రీనివాస‌నగర్‌లో ఉండే గయప్పాంజన్ వయసు 39 ఏళ్లు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గయప్పాంజన్‌ తల్లి పేరు నీలవతి.. ఈమె వయసు 59 ఏళ్లు. *అయితే గురువారం సాయంత్రం రోజున గయప్పాంజన్ తల్లితో కలిసి సింహాచలం వచ్చారు. అక్కడే పోస్టాఫీసు వీధిలో ఉండే ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం సమయంలో లాడ్జి సిబ్బంది గది తలుపులు తట్టారు. 24 గంటలు కావటంతో లాడ్జి రూమ్ కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయం కనుగొనేందుకు గది తలుపు తట్టారు. అయితే లోపలి వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. పైగా గడియ పెట్టి ఉంది. దీంతో లాడ్జి యాజమాన్యం గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గోపాలపట్నం సీఐ ఘటనాస్థలికి చేరుకుని లాడ్జి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూస్తే.. తల్లీ కొడుకు సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించారు.* దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే గయప్పాంజన్, అతని తల్లికి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. మరోవైపు గయప్పాంజన్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో ఇప్పటికే వివాహమైంది. అయితే భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో 2023లో హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో గయప్పాంజన్ భార్య.. అతనిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. *అయితే దీనికి ఆత్మహత్యకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనుూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒకేసారి లాడ్జిలో రెండు మృతదేహాలు లభ్యం కావటంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.