డోర్నకల్‌ రైల్‌ ఓవర్‌ రైల్‌ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. ఇక సులభంగా ట్రైన్ ప్రయాణాలు

Wait 5 sec.

ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ట్రైన్ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలోని డోర్నకల్ జంక్షన్ వద్ద ప్రతిపాదించిన కీలకమైన రైల్ ఓవర్ రైల్ (RoR) ప్రాజెక్టుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఈ రద్దీ మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. డోర్నకల్ జంక్షన్ కాజీపేట-విజయవాడ లైన్‌లో ఉంది. ఇది దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఉత్తర-దక్షిణ భారతదేశం గ్రాండ్-ట్రంక్ మార్గంలో ఒక భాగం. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వైపు వెళ్లే రైళ్ల కోసం డోర్నకల్ జంక్షన్ వద్ద బైపాస్ లైన్ నిర్మించినప్పటికీ.. ఈ మార్గంలో రైళ్లు స్టేషన్ మీదుగా క్రాసింగ్ ద్వారా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల రైళ్లను తరచుగా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది, ఫలితంగా సమయం వృథా అవుతుంది ఇతర మార్గాల్లోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. 10.5 కి.మీ.ల పొడవైన ఈ రైల్ ఓవర్ రైల్ (RoR) నిర్మాణం ద్వారా.. విజయవాడ నుంచి డోర్నకల్ మీదుగా భద్రాచలం రోడ్ వైపు వెళ్లే రైళ్లకు క్రాసింగ్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఇది ఒక మార్గంలో వెళ్లే రైలు, మరొక మార్గంలో ఉన్న ట్రాక్‌ల మీదుగా నిర్మించిన ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా భద్రాచలం రోడ్, పరిసర బొగ్గు బెల్ట్ ప్రాంతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు జరిగే బొగ్గు రవాణాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే (SCR) పేర్కొంది. బొగ్గు రవాణాకు ఆటంకం తొలగిపోవడం వల్ల రైల్వే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కాజీపేట నుంచి విజయవాడ వరకు ప్రస్తుతం మూడో లైను నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. దీనితో పాటు ఈ మార్గంలో నాలుగో లైను నిర్మించే ప్రతిపాదన కూడా పురోగతిలో ఉంది. ఈ విస్తరణ పనులకు RoR ప్రాజెక్టు పూర్తి మద్దతు ఇస్తుంది. మొత్తంమీద డోర్నకల్ వద్ద ఆర్వోఆర్ ప్రాజెక్టు ఆమోదం పొందడం ఈ రద్దీ మార్గంలో రైళ్ల వేగం, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ట్రైన్ ప్రయాణాలు కూడా సులభతరం కానున్నాయి.